మంత్రి పదవి ఎప్పుడు?: ఆ ప్రశ్న కోసమే భూమా ఎదురుచూపు!
హైదరాబాద్: వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమ నాగిరెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది! గత సార్వత్రిక ఎన్నికల్లో భూమన వైసిపి నుంచి గెలుపొందారు. ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.
టిడిపిలో చేరిన ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ నియోజకవర్గ అభివృద్ధితో పాటు మంత్రి పదవి కోసం ఆయన సైకిల్ ఎక్కారట. పార్టీ మారే సమయంలోనే కేబినెట్ హోదా, పలు కేసుల నుంచి ఉపశమనం తదితర తాయిలాలు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇందులో భాగంగా మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా భూమాను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. పార్టీ మారారు కదా, మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడుతున్నారని ప్రశ్నించింది. దానికి భూమా స్పందిస్తూ... ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని, అయితే ఆ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదని చెప్పారు.
అదే సమయంలో మీ జిల్లా కర్నూలు నుంచి ఇంకెవరైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారా అని మీడియా ప్రశ్నించింది. దానిపై మాట్లాడుతూ.. మీరు ఎవరైనా జాబితా ఇస్తే, వారిని పార్టీలో చేర్చేందుకు యత్నిస్తానని చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు నవ్వేశారు.