రేవంత్ అరెస్టుపై అలా, నా అరెస్టుపై ఇలానా..: భూమా ఫైర్
కర్నూలు: తెలుగుదేశం పార్టీ నాయకులపై, కర్నూలు జిల్లా ఎస్పీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల శాసనసభ్యుడు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించిందని, అలాంటప్పుడు తనను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
తనను అరెస్టు చేయడంపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ఈసి అనుమతి లేకుండా తనను ఎలా అరెస్టు చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భూమా నాగిరెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే కర్నూలు జిల్లా ఎస్పీ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన విమర్శించారు. కర్నూలు జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్షలు పెంచుకునే బదులు ఉద్యోగానికి రాజీనామా చేసి టిడిపిలో చేరాలని ఆయన వ్యాఖ్యానించారు.
తనను రాజకీయంగా ఎదుర్కొలేకనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో పట్టుకోసమే తనపైనా, తన కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ కేసులకు భయపడే పరిస్థితి లేదంటూ టిడిపి నేతలు తనపై అబద్ధాలు ప్రచారం చేసి, కర్నూలు ప్రజలకు దూరం చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపణ చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు వేధిస్తున్నారని, వెంటనే వేధింపులు ఆపకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని భూమా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications