భూమా వారసుల ఫైట్ - అక్కలపై సోదరుడి కేసు : అక్కడే అసలు ట్విస్టు..!!
దివంగత భూమా నాగిరెడ్డి- శోభా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా... మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఆస్థికి సంబంధించిన అంశం పైన భూమా కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల దగ్గర తన తల్లిపేరుపై ఉన్న స్థలంలో వాటా ఇప్పించాలని కోరుతూ నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాగా, తన పిటిషన్లో ప్రతివాదులుగా భూమా అఖిలప్రియ, మౌనికలతో పాటుగా భూమిని కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తుల పేర్లను చేర్చారు.
నాగిరెడ్డి విక్రయించిన స్థలం విషయంలో
భూమా నాగిరెడ్డి తన భార్య శోభ పేరిట భమిని కొనుగోలు చేసారు. శోభా రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత నాగిరెడ్డి ఆ భూమిని 2016లో వేరే వాళ్లకు అమ్మారు. అయితే, కుమారుడు మైనర్ గా ఉన్నారు. ఆ అమ్మకంకు సంబంధించి తన అక్కలు ఇద్దరూ సంతకాలు చేశారు. అయితే, అప్పటికి జగత్ విఖ్యాత్ మైనర్ కావడంతో తనతో వేలి ముద్ర వేయించారని ఆయన చెప్పుకొచ్చారు. క్రమంలో ఆ భూమి అమ్మకం చెల్లదంటూ పిటిషన్లో కోర్టుకు విన్నవించారు. భూమి అమ్మకం జరిగిన కొద్దిరోజుల తర్వాత నాగిరెడ్డి కూడా మరణించారు. అమ్మకం సమయంలో భూమి విలువ నాడు రూ 2 కోట్లు ఉండగా, ఇప్పుడు ఆ విలువ రూ 6 కోట్లకు చేరింది. గతంలోనే దీనికి సంబంధించి అక్కలతో పాటుగా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
అక్కలను ప్రతివాదులుగా చేర్చుతూ
అప్పట్లో ఆ కోర్టులో పిటీషనర్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఇదే కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత భూమా వారసులుగా ముగ్గురు సంతానం ఒక్కటిగానే వ్యవహరించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి.. తల్లి స్థానంలో ఆళ్లగడ్డ నుంచి ఏకగ్రీవంగా ఎన్నకైన అఖిలప్రియ తండ్రితో కలిసి టీడీపీలోకి వెళ్లిన తరువాత కొద్ది కాలానికి మంత్రి అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ ఫ్యామిలీ మొత్తం టీడీపీ నుంచి పోటీ చేసిన తమ బ్రహ్మానందరెడ్డి విజయం కోసం పని చేసారు. ఇక, 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత వారి మధ్య విబేధాలు వచ్చినట్లు చెబుతున్నారు.
రాజకీయ అడుగుల పైన చర్చ
తమ తండ్రి ఆస్తుల విషయంలో నాడు నాగిరెడ్డికి కుడి భుజంగా వ్యవహరించిన మరో ముఖ్య నేత పైన భూమా వారసులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు, సొంత అక్కల మీదనే సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కేసు దాఖలు చేయటం పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది. అయితే, వాస్తవంగా అక్కా -తమ్ముళ్ల మధ్య వివాదం లేదని.. ఆ స్థలం గురించి నష్టపోయామనే కారణంగానే ఇప్పుడు కేసు దాఖలు చేసారనే మరో వాదన వినిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల నాటికి మాత్రం అఖిల ప్రియ టీడీపీలోనే ఉంటారా.. లేక, రాజకీయంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా అనే చర్చ ఇప్పుడు నంద్యాల..ఆళ్లగడ్డల్లో వినిపిస్తోంది. ఇప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టులో కేసు వేయటం.. ప్రతివాదులుగా తన అక్కల పేర్లు చేర్చటంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.