భూమన సినిమా కథ: 'మొదటి సీన్లోనే ఎన్టీఆర్ని మోసం చేసిన బాబు'
విజయవాడ: మొదటి రీల్ నుంచి చివరి రీల్ దాకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే విలన్ అని వైసిప నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం నాడు మండిపడ్డారు. జగన్ మంగళవారం సినిమా కథ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి నేతలు భగ్గుమన్నారు.
ఏపీ రాజకీయ సినిమాలో చంద్రబాబే హీరో అని, జగన్ విలన్ అని టిడిపి నేతలు వ్యాఖ్యానించారు. దీనిపై భూమన కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మొదటి రీల్ నుంచి ఆఖరి రీల్ వరకు విలనిజం ప్రదర్శిస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబు మొదటి రీల్లోనే ఎన్టీఆర్ను మోసం చేశారన్నారు.
ఎన్టీఆర్ విషయంలోనే చంద్రబాబు విలనిజం బయట పడిందని ఎద్దేవా చేశారు. జగన్ పై వ్యక్తిగత దాడి చేయడమే తప్పా మీరు చెప్పుకునేందుకు ఏవైనా అభివృద్ధి పనులు చేశారా అని ప్రశ్నించారు. జగన్ పైన వ్యక్తిగత దాడులకే ప్రభుత్వ నేతలు పరిమితం అవుతున్నారన్నారు.
మీ తప్పులను సవరించే పని జగన్ చేస్తున్నారన్నారు. సంకల్ప దీక్ష అన్నది చంద్రబాబుకు లేదని ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులు అభివృద్ధి విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు.
వైయస్ జగన్ ప్రసంగానికి టిడిపి నేతలు, మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించటారు. హామీలు అమలు చేయాలని గుర్తు చేయడం అభివృద్ధిని అడ్డుకోవడం అవుతుందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాజీపడ్డారన్నారు.
ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్ వదిలేసి బెజవాడకు మకాం మార్చారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి తిరిగి గెలుపొందాలని సవాల్ చేశారు. టిడిపి బెదిరింపులకు భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు. ఉన్మాద రాజకీయాలు చంద్రబాబుకు తెలుసన్నారు.