వేల కోట్ల దోపిడీకి శ్రీకారం: బాబుపై భూమన ఫైర్, ‘సీమ కడుపుకొట్టొద్దు’
హైదరాబాద్/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని ఆరోపించారు.
మంగళవారం తిరుపతిలో నిర్వహించిన గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భూమన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం చేస్తున్నారని విమర్శించారు
స్విస్ ఛాలెంజ్ విధానం వట్టి బూటకమని ఆయన అన్నారు. తమకు అనుకూలమైన వారికే పనులు అప్పగించి.. రూ. వేల కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారని చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకే తాము గడప గడపకు వెళ్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
సీమ ప్రజల కడుపుకొట్టొద్దు: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: రాయలసీమ ప్రజల కడుపు కొట్టొద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 200టీఎంసీలకు తగ్గకుండా కృష్ణా నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెబుతున్నట్లుగా తమకు పట్టిసీమ నుంచి నీళ్లు అక్కర్లేదని, రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీరు వస్తే చాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలు సీఎంలు సంప్రదింపులు జరుపుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎప్పటికీ శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం 854 అడుగులకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
నిరుడు రాయలసీమ ప్రాంతానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కృష్ణా నీరు చుక్క కూడా రాలేదని అన్నారు. ఈ ఏడాది కూడా రాయలసీమ ప్రజల కడుపు కొట్టొద్దని అన్నారు. నిరుడు జలాశయంలో 780అడుగులకు నీటి మట్టం తగ్గిపోయి సీమకు అన్యాయం జరిగిందని అన్నారు. అందువల్ల విద్యుత్ ఉత్పాదన పేరుతో నీటిని కిందకు వదలొద్దని కోరారు.
ఇప్పటి వరకు మూడు సార్లు పట్టిసీమను ప్రారంభించిన సీమకు నీరు రాలేదని ఎద్దేవా చేశారు. పట్టిసీమ నుంచి నీళ్లు రాకపోయినా ఫర్వాలేదు గానీ, తమకు వచ్చే నీళ్లను మాత్రం రాకుండా చేయొద్దని అన్నారు. దివంగత సీఎం వైయస్ చేపట్టిన ప్రాజెక్టుల వల్లే ఈనాడు ప్రజలకు మేలు జరుగుతోందన్నారు.