సిఎం గెస్ట్హౌస్ను సందర్శించిన భువనేశ్వరి: మీడియాపై బాబు కామెంట్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి కరకట్ట వద్ద ప్రతిపాదించిన ముఖ్యమంత్రి అతిథి గృహాన్ని నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి బుధవారంనాడు సందర్శించారు. గృహంలో జరుగుతున్న మరమ్మత్తులను పరిశీలించారు.
మరమ్మతుల విషయంలో భువనేశ్వరి పలు సూచనలు చేశారు. అతిథి గృహం కృష్ణానదీ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని భువనేశ్వరి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, మీడియాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా రాజకీయంగా కలుషితం కావడంతో, దాని విశ్వసనీయత తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మీడియాను చూసి ఓట్లేసే రోజులు పోయాయని ఆయన అన్నారు. కొన్ని మీడియా సంస్థలు రాజకీయ సిద్ధాంతాలను ప్రమోట్ చేస్తున్నాయని ఆయన అన్నారు. అయితే ప్రజలకన్నీ తెలుసునని, ప్రజలను ప్రభావితం చేసేలా మీడియా కథనాలు ఉండడం లేదని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసరాల నుంచి పాలన సాగితే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందని చంద్రబాబు అన్నారు. విజయవాడకు రాజధాని కళ వచ్చిందని అన్నారు. ఇప్పటికే కొంత మంది మంత్రులు విజయవాడ నుంచి పనిచేస్తున్నారని, ఒకటి రెండు నెలల్లో అంతా ఒక కొలిక్కి వస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణ నుంచి అధికారులు ఇక్కడికి రావడానికి, వారి పిల్లలు అక్కడ చదవడం ఆటంకంగా ఉందని అన్నారు. దానికి తోడు అందరికీ వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ అంశాలన్నింటిపైనా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications