విభజన: అధిష్టానంతో సిఎం కిరణ్ రెడ్డి రాజీ పడ్డారా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో గత రెండు మూడు రోజులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో మార్పు వచ్చినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు మాట్లాడుతూనే ఆయన కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన తన ధాటిని తగ్గించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం ముందుకు సాగితే రాజీనామా చేస్తానని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇస్తూ వచ్చారు. దాంతో పాటు కిరణ్ కుమార్ కొత్తగా సమైక్యాంధ్ర పార్టీ పెడుతారనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ఆయన వర్గం సాగించినట్లు చెబుతున్నారు.
సమైక్యాంధ్ర విషయంలో వెనక్కి తగ్గేది లేదని సంకేతాలు ఇస్తూ, పరోక్ష హెచ్చరికలు చేస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం దాదాపుగా పక్కన పెట్టి తెలంగాణ ప్రక్రియను ముందుకు నడిపించడానికి సిద్ధమైనట్లు కనిపించింది. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధిస్తామని ఎఐసిసి అధికార ప్రతినిధి ఒక్కరు చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ కూడా తెలంగాణపై వెనక్కి తగ్గబోమని, ముందుకు సాగడానికి తమ మార్గాలు తమకు ఉన్నాయని చెబుతూ వచ్చారు.

రాష్ట్ర విభజన విషయంలో పార్టీ అధిష్టానం వెనక్కి తగ్గబోదని గ్రహించిన కిరణ్ కుమార్ రెడ్డి వెనక్కి తగ్గడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తనను పక్కన పెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను కలుపుకుని సీమాంధ్రలో ముందుకు పోవాలని అనుకున్నట్లు కూడా ఆయన గ్రహించినట్లు చెబుతున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానంతో రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు.
ఈ స్థితిలోనే సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెలను విరమింపజేసేందుకు స్వయంగా నడుం బిగించారని అంటున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెను, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను ఆయన విరమింపజేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయనే స్వయంగా చర్చలు జరిపి పరిష్కారానికి మార్గం వేశారు. ఎపిఎన్జీవోల సమ్మె కూడా ఆగిపోవచ్చునని అంటున్నారు. ఇదే సమయంలో ఫైలిన్ తుఫాను వచ్చింది. తుఫాను సహాయక చర్యల విషయంలో, ముందు జాగ్రత్త చర్యల విషయంలో ముందుకు రాకపోతే తీవ్ర విమర్శలు రావడం తప్పదు. దీంతో ఆయన యంత్రాంగాన్ని కదిలించారు. మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, రాష్ట్రంలోని జరుగుతున్న పరిణామాలపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రతి రోజూ దిగ్విజయ్ సింగ్కు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్కు వివరిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రకు తననే ముఖ్యమంత్రిగా ఉంచాలని కూడా ఆయన కోరుతున్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications