బిగ్ ప్లాన్ రెడీ చేసిన పవన్ ? తాజా మార్పు వెనుక అసలు వ్యూహమిదే.. !
ఏపీలో టీడీపీ-జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం వారాహి యాత్రకు ముందు, ఆ తర్వాత పవన్ వ్యాఖ్యల్లో చోటు చేసుకున్న మార్పే. వారాహి యాత్రకు ముందు చంద్రబాబుతో వరుస భేటీలు, ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో చర్చలు జరిపిన పవన్.. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న సంకేతాలు ఇచ్చారు. కానీ తాజాగా ప్రతీ నియోజకవర్గానికి వెళ్లి జనసేనను గెలిపించమంటున్నారు.
గతంలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయాలని పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తర్వాత ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. కేవలం వైసీపీని విమర్శిస్తూ, విపక్షాలు కలిసి ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు. తద్వారా ఒకే సమయంలో జనసేన కుదిరితే ఒంటరిపోరు లేకపోతే విపక్షాలతో కలిసి కూటమి కడుతుందన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇక్కడే జనంలో గందరగోళం పెరుగుతోంది.

పవన్ తాజా వ్యాఖ్యలు, వ్యూహాలు చూస్తుంటే తోటి విపక్షాలతో కూటమికి సిద్ధంగానే ఉన్నప్పటికీ సాధ్యమైనంత ఎక్కువ సీట్లు బేరమాడుకోవాలనే ఆతృత కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే తన సీఎం పదవిపై అంచనాలు పెంచడం ద్వారా చంద్రబాబుతో సీఎం సీటు కూడా బేరమాడుకునే పరిస్దితి తీసుకురావాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు పవన్ వ్యూహాలపై స్పందించేందుకు టీడీపీ నేతలు కూడా ముందుకు రావడం లేదు.

వచ్చే ఎన్నికల్లో జనసేనకు వచ్చే సీట్లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఎలాగైనా సీఎం కావాలనే డిమాండ్లను ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు తెరపైకి తెస్తున్నారు. ఎందుకంటే పవన్ సీఎం కాకుండా చంద్రబాబును సీఎం చేసే లక్ష్యంతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అంతిమంగా అది నష్టం చేస్తుందనే భావన జనసేనలో అంతర్గతంగా వినిపిస్తోంది. అందుకే పవన్ ఇప్పుడు సీఎం పదవితో పాటు పొత్తులపై ఇంకా తేల్చలేదని, అవసరమైతే ఒంటరిపోరుకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications