భయపెట్టి పారిపోయిన జవాద్ తుపాన్-ఏపీకి తప్పిన ముప్పు-ఒడిశా వైపు పయనం
ఏపీ-ఒడిశా మధ్య తీరం దాటుతుందని ఊహించిన జవాద్ తుఫాను అనూహ్యంగా దిశ మార్చుకుంది. ఇవాళ దిశ మార్చుకుని ఒడిశాలోని పూరీ తీరం వైపు పయనిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కిలోమీటర్ల దూరంగా ఇది కేంద్రీకృతం అయిందని వాతావరణ విభాగం ప్రకటించింది.
వాస్తవానికి ఇవాళ ఉత్తర కోస్తాంధ్ర తీరం వద్దకు చేరుకున్న జవాద్ తుపాను అనూహ్యంగా దిశ మార్చుకుంది. ఆ తర్వాత ఒడిశా తీరం వైపు పయనించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం జవాద్ తుపాను మెల్లగా ఒడిశా తీరం వైపు పయనిస్తోంది. ఇది గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో మాత్రమే పయనిస్తోందని అధికారులు గుర్తించారు. దీని పరిస్ధితి చూస్తుంటే మరికొన్ని గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండానికి బలహీన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఒడిశా తీరానికి సైతం ముప్పు ఉండకపోవచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
ప్రస్తుతం కదులుతున్న వేగం ప్రకారం చూస్తే జవాద్ తుపాను రేపు మధ్యాహ్నానికి పూరి తీరం వరకూ వెళ్లి బలహీన పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది తీరం దాటే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దీంతో ఏపీ-ఒడిశాలకు కూడా తుపాను ముప్పు తప్పినట్లయింది. ప్రస్తుతానికి తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వం ముందుగానే మత్సకారుల్ని సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు చేసింది. జవాద్ తుపాను బలహీనపడుతున్నప్పటికీ వచ్చే 24 గంటల్లో ఓ మోస్తరుగా వర్షాలు పడే అవకాశం మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నిన్న వర్షాలపై సీఎం జగన్ కూడా అధికారులతో సమీక్ష నిర్పహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతో తుపాను దిశ మార్చుకున్నా వర్షాలపై అప్రమత్తంగానే ఉండాల్సిన పరిస్దితి నెలకొంది.