జగన్ సర్కార్ కు భారీ ఊరట-సుప్రీంకు ఎస్ఓపీ ఇచ్చిన కేంద్రం .. !
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక హైకోర్టు నుంచి అధికారులకు కోర్టు ఉల్లంఘనలకు సంబంధించి అక్షింతలు ఎక్కువయ్యాయి. అలాగే పలు కేసుల్లో అధికారులు హైకోర్టు ఆదేశాలు పాటించనందుకు కోర్టుకు స్వయంగా హాజరైన పరిస్ధితి. ఇందులో రాష్ట్ర డీజీపీలతో పాటు పదికి పైగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు ఉన్నారు. ఇలా వీరిని కోర్టులకు రప్పించడంతో పాటు వీరిపై వ్యాఖ్యలు చేసే విషయంలో జడ్డీల్ని కట్టడి చేసేలా కేంద్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
న్యాయమూర్తులు అధికారులపై చేసే వ్యాఖ్యలు, కోర్టుకు పిలిపించడం, ఇతరత్రా అంశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు మార్గదర్శకాలతో కూడిన ఎస్ఓపీని జారీ చేసింది. ఇందులో న్యాయమూర్తులు ప్రభుత్వ అధికారుల వస్త్రధారణ, రూపురేఖలు, విద్యా, సామాజిక నేపథ్యంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆంక్షలు పెట్టింది. అలాగే కోర్టులకు అధికారుల్ని అసాధారణ సందర్భాల్లో తప్ప రప్పించకూడదు. అలాగే ఏదైనా కేసుల్లో కోర్టు అధికారుల కమిటీని నియమించవచ్చు కానీ అందులో ఎవరు ఉండాలో సూచించరాదు.

తాజాగా కోర్టు ధిక్కార కేసుల్లో అధికారులపై అలహాబాద్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు తీసుకున్న చర్యల నేపథ్యంలో కేంద్రం ఈ ఎస్ఓపీని జారీ చేసింది. తాజాగా మణిపూర్ అల్లర్లపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకునేందుకు డీజీపీని సుప్రీంకోర్టు రప్పించింది. దీంతో కేంద్రం ఈ నియామవళి రూపొందించి సుప్రీంకోర్టుకు పంపింది. దీనిపై రాష్ట్రాల హైకోర్టుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటామని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. హైకోర్టులు తమ అభిప్రాయం చెప్పాక సుప్రీం సీజే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
సుప్రీంకోర్టు కనుక కేంద్రం ఎస్ఓపీని ఆమోదిస్తే ఏపీలో జగన్ సర్కార్ తో పాటు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఊరట కలగబోతోంది. ఎందుకంటే ఇప్పటికే వేల కొద్దీ కోర్టు ధిక్కార కేసులు పెండింగ్ లో ఉన్న పరిస్ధితుల్లో హైకోర్టులు ఆయా రాష్ట్రాల్లో అధికారులపై తరచూ ఏదో ఒక వ్యాఖ్య చేస్తుండటం, కోర్టులకు పిలిపిస్తుండటం పరిపాటిగా మారింది. దీనిపై ప్రభుత్వాలు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన ఎస్ఓపీని సుప్రీంకోర్టు ఆమోదిస్తే ఇలాంటి చర్యలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications