పోసానికి బెయిల్-పోలీసు కస్టడీ డిస్మిస్..!
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి భారీ ఊరట లభించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత వరుసగా ఆయనకు రిమాండ్లు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇవాళ పోసానికి భారీ ఊరట లభించింది.

వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గత ప్రభుత్వ హయాంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులోనే పోసానిని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఇంట్లో అరెస్టు చేసి తెచ్చారు. ఆ తర్వాత ఆయనపై రిమాండ్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కడప మొబైల్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అదే సమయంలో పోసాని కృష్ణమురళిని ఇదే కేసులో కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కడప మొబైల్ కోర్టు తోసిపుచ్చింది. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని కస్టడీలోకి తీసుకుని విచారించేంత పరిస్ధితి లేదని భావించిన కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అలాగే పోలీసు కస్టడీని కూడా నిరాకరించింది. మరోవైపు పోసానికి ఈ కేసులో బెయిల్ లభించినా మిగతా కేసుల్లో నిందితుడిగానే ఉంటూ రిమాండ్ లో ఉన్నారు. దీంతో ఆయా కేసుల్లోనూ పోసానికి బెయిల్ లభిస్తేనే ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోసాని తనపై నమోదైన కేసుల్లో బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications