పేర్ని నాని సతీమణికి భారీ ఊరట..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు ఇవాళ ఊరట లభించింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఇవాళ స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పేర్ని జయసుధ అరెస్టుకు ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె భర్త పేర్ని నాని తాజాగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు ఆమెకు ఊరటనిచ్చింది.

మచిలీపట్నంలో పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యంలో 378 మెట్రిక్ టన్నుల మేర మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఆమె గతంలో 1.68 కోట్ల రూపాయలు డీడీలు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. అయితే ఇవాళ మరోసారి కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆమెకు నోటీసులు పంపారు. అప్పట్లో గుర్తించిన బియ్యానికి అదనంగా మరింత బియ్యం మాయమైనట్లు గుర్తించామని, ఇందుకు గానూ మరో 1.67 కోట్లు కట్టాలని పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ కేసులో తనపై నమోదు చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేయవచ్చన్న సమాచారంతో పేర్ని జయసుధ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచే ఆమె కృష్ణా జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని షరతు పెట్టింది.
మరోవైపు రేషన్ బియ్యం కేసులో తన భార్య పేర్ని జయసుధ అరెస్టుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నించినా సీఎం చంద్రబాబు మాత్రం ఆడవాళ్లను అరెస్టు చేయొద్దని ఆపారంటూ పేర్ని నాని ఇప్పటికే వెల్లడించారు.ఆ మేరకు రాజకీయాల్లో హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు కూడా. అయితే ఇప్పుడు పేర్ని జయసుధ అరెస్టు కాకుండా కోర్టు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆమెను అరెస్టు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లు అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications