రఘురామకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్-సీబీఐ విచారణకు బ్రేక్..
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ విచారణ జరుపుతున్న ఓ కేసులో రఘురామకు ఈ ఊరట లభించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు కేసుల్లో పోరాటం చేస్తున్న రఘురామకు ఈ వ్యవహారంలో మాత్రం ఊరట దక్కింది.
రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ సంస్ధ దివాళా తీసిందని ఆరోపిస్తూ సీబీఐ పలు కేసులు నమోదుచేసింది. రఘురామతో పాటు ఇండ్ భారత్ డైరెక్టర్లపైనా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తోంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణను నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రఘురామకు భారీ ఊరట దక్కినట్లయింది.

గతంలో ఇదే కేసులో సీబీఐ కేసుల్ని సవాల్ చేస్తూ రఘురామ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు మద్దతుగా తీర్పు వచ్చింది. అయితే హైకోర్టు సీజే మారగానే సీబీఐ విచారణపై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు ఉపసంహరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రఘురామ పిటిషన్ను జస్టిస్ అజయ్ రస్తొగి, జస్టిస్ సీటీరవికుమార్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా ఇండ్ భారత్ ను దివాళా కంపెనీగా ప్రకటించడానికి అనుసరించాల్సిన విధానాన్ని సీబీఐ పాటించలేదని రఘురామ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. ఈ కేసు విచారణపై స్టే ఇచ్చింది. ఈ కేసులో తుది తీర్పు వెలువడేంతవరకూ విచారణను నిలిపివేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications