జగన్ సర్కార్ కు హైకోర్టు భారీ షాక్- వీఆర్వోల జీవో కొట్టివేత- సర్పంచ్ లదే అధికారం
ఏపీలో గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత జరిగిన మార్పుల్లో భాగంగా జగన్ సర్కారు తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ రాజ్ వ్యవస్ధకు సమాంతరంగా ఏర్పాటైన గ్రామ సచివాలయాల్లో అధికారాల్ని సర్పంచ్ లు, కార్యదర్శుల నుంచి వీర్వోలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్ట్ ఇవాళ కొట్టేసింది. గ్రామ సచివాలయాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
సచివాలయాలకు అధికారాల బదిలీ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల్లో అధికారాలు ఎవరికి ఉండాలనే దానిపై గతంలో పలు వాదనలు జరిగాయి. చివరికి ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ లు, కార్యదర్శులకు ఉన్న అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెట్టేందుకు వీలుగా జీవో నంబర్ 2 జారీ చేసింది. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పంచాయతీ రాజ్ వ్యవస్ధ ఉండగా సచివాలయాల ఏర్పాటే తప్పిదమని, అలాంటిది వాటి అధికారాల్ని కూడా వీఆర్వోలకు కట్టబెట్టడం సరికాదనే విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం అధికారాల బదిలీకే మొగ్గుచూపింది.
సచివాలయాలపై జగన్ కు హైకోర్టు షాక్
ఏపీలో రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ వ్యవస్ధ అమల్లో ఉండగా.. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శుల అధికారాల్ని వారికి బదిలీ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన జీవో 2ని రద్దుచేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ టి.కృష్ణమోహన్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఈ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసింది.
సమాంతర వ్యవస్ధపై గతంలోనే హైకోర్టు ప్రశ్నలు
గతంలోనే ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్ధ అమల్లో ఉండగా.. ప్రభుత్వం సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. సమాంతర వ్యవస్ధ ఎందుకని ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, సర్పంచ్ల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది.
Recommended Video
సర్కార్ వాదనతో ఏకీభవించని హైకోర్టు
ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత చేరువ చేసేందుకే వీఆర్వో వ్యవస్దను బలోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వం పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది. సర్పంచ్ లు, కార్యదర్శుల అధికారాల బదిలీతో పంచాయతీ రాజ్ వ్యవస్ధకు వచ్చిన ముప్పేమీ లేదని వెల్లడించింది. అయితే హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. పిటిషనర్ చెప్తున్న విధంగా రాజ్యాంగంలోని 72వ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటైన పంచాయతీ రాజ్ వ్యవస్ధ ఉండగా.. దాన్ని కాదని అధికారాల్ని బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు... జీవో నంబర్ 2ను సస్పెండ్ చేసింది.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.