సంచలనం, శత్రుచర్లకు కోర్టు భారీ షాక్: ఎమ్మెల్యేగా జీతమంతా తిరిగిచ్చేయాలి
అమరావతి: మాజీ మంత్రి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకుడు శత్రుచర్ల విజయ రామరాజుకు హైకోర్టులో సోమవారం నాడు చుక్కెదురయింది. ఎమ్మెల్యేగా ఆయన పొందిన మొత్తం వేతనాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యే తన అయిదేళ్ల వేతనాన్ని వెనక్కి ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించడం ఇది దేశ రాజకీయాల్లోనే ఓ షాకింగ్గా చెప్పవచ్చు. 1999 నుంచి 2004 వరకు పార్వతీపురం ఎమ్మెల్యేగా ఉన్నారు శత్రుచర్ల. ఆ కాలానికి సంబంధించిన వేతనాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని తాజాగా హైకోర్టు ఆదేశించింది.

ఏం జరిగింది?
1999లో ఆయన పార్వతీపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయిదేళ్ల పాటు అంటే 2004 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ నియోజకవర్గం అప్పుడు ఎస్టీకి రిజర్వ్ చేయబడింది. కానీ శత్రుచర్ల పోటీ చేసి గెలిచారు.
అయితే, క్షత్రియుడైన విజయ రామరాజు ఎస్టీగా పోటీ చేయడం తగదని నిమ్మక జయరాజు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ తర్వాత సుప్రీం కోర్టు వరకు వెళ్లినా విజయ రామరాజు క్షత్రియుడేనని, అందువల్ల ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తగదని, ఆయన ఎన్నిక చెల్లదని తేల్చారు. ఆయన ఎన్నిక చెల్లదని నాడు న్యాయస్థానం తేల్చి చెప్పింది.
అనంతరం, ఎమ్మెల్యేగా శత్రుచర్ల ఎన్నిక సరికానప్పుడు ఆయన పొందిన వేతనం మాట ఏమిటని మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దానిని హైకోర్టు విచారించింది. వాదనల అనంతరం ఆదేశాలు జారీ చేసింది. జీతభత్యాలను రికవరీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
తప్పుడు వివరాలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ ఖజానా నుంచి తాము పొందిన వేతనాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఓ విధంగా సంచలన తీర్పు అని చెప్పవచ్చు. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. వైసిపి తరఫున రమణమూర్తి చేతిలో ఓడిపోయారు.












Click it and Unblock the Notifications