విశాఖ రైల్వేజోన్ పై క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం-పార్లమెంట్ లో ప్రకటన- ఇక జగన్ చేతుల్లోనే
ఏపీలో విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం ఇవాళ క్లారిటీ ఇచ్చేసింది. కొన్నేళ్లుగా వైజాగ్ రైల్వే జోన్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ దీంతో పూర్తి స్ఫష్టత వచ్చేసింది. ఒడిశాకు చెందిన రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంటులో ఇవాళ చేసిన ప్రకటనతో రైల్వే జోన్ విషయంలో నెలకొన్న అపోహలన్నీ తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ పాత్ర కీలకంగా మారిపోయింది. ఇప్పుడు జగన్ ఏం చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

విశాఖ రైల్వే జోన్ హామీ
ఏపీని ఏపీ-తెలంగాణగా విభజిస్తున్న సందర్భంగా 2014లో యూపీఏ సర్కార్ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు పలు హమీలు ఇచ్చింది. వీటిలో విశాఖ రైల్వే జోన్ కూడా ఒకటి. దేశంలో ప్రస్తుతం ఉన్న 17 రైల్వే జోన్లకు తోడు విశాఖలో మరో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారా విభజన ద్వారా నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రంపై ఈ వ్యవహారంలో చంద్రబాబు ధర్మపోరాటం కూడా చేశారు. ఓ రకంగా చూస్తే వైజాగ్ రైల్వే జోన్ అనేది సెంటిమెంట్ గా మారిపోయింది.

రైల్వే జోన్ పై అడుగులు
ఏపీలోని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని గతంలో యూపీఏ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర రైల్వే శాఖ అడుగులు వేసింది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే తలెత్తే పరిస్ధితులపై పలు దఫాలుగా చర్చించింది. రాష్ట్రానికి చెందిన ఎంపీల అభిప్రాయాలు కూడా తీసుకుంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా అటు దక్షిణ మధ్య రైల్వే, ఇటు కోస్తా రైల్వేకు ఇబ్బందులు లేకుండా చూడాలని భావించింది. దీనికి కొత్తగా కోస్తా సరిహద్దు రైల్వేగా నామకరణం కూడా చేసింది. అలాగే ఒడిశాలోని కొన్ని జిల్లాలతో కలుపుకుని ఈ జోన్ ఏర్పాటు దిశగా సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నట్లు రైల్వేశాఖ పలుమార్లు చెప్పింది.

రైల్వేజోన్ పై కేంద్రం షాక్
ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటవుతుందని అంతా ఆశించారు. లేకపోయనా కనీసం ఒడిశాలోని రాయగఢ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటైనా వాల్తేర్ జోన్ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందని భావించారు. కానీ ఈ ఆశలన్నింటినీ ఆవిరి చేస్తూ ఒడిశాకు చెందిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇవాళ పార్లమెంట్ లో ఓ ప్రకటన చేశారు. దీంతో ఏపీలో రైల్వే జోన్ వస్తుందని ఆశలు పెట్టుకున్న వారందరికీ భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా రైల్వే జోన్ కోసం అప్పట్లో ఆందోళనలు చేసిన వారు, ప్రయత్నాలు చేసిన వారంతా రైల్వేమంత్రి ప్రకటనతో షాకయ్యారు.

కొత్త రైల్వే జోన్లు ఇవ్వలేమన్న కేంద్రం
దేశంలో కొత్తగా రైల్వేజోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదని ఇవాళ పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చిచెప్పేశారు.
బీజేపీ ఎంపీ అజయ్నిషాద్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ మేరకు జవాబిచ్చారు. దేశంలో ప్రస్తుతం 17 రైల్వేజోన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. అదే సమయంలో విశాఖ రైల్వేజోన్ అంశాన్ని అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్లను ప్రకటించే ఉద్దేశం లేదని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఏపీలోరైల్వే జోన్ వస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి.

జగన్ ఏం చేస్తారో ?
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన పిభజన హామీలన్నింటికీ ఒక్కొక్కిటిగా తుంగలో తొక్కుతోంది. ఇప్పుడు రైల్వే జోన్ కూడా ఇవ్వలేమని తేల్చేసింది. అదే సమయంలో కేంద్రంతో వైసీపీ సత్సంబందాలు కొనసాగుతున్నాయి. వాటిని ఉపయోగించుకుని రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఎలాగైనా తీసుకొస్తారని జగన్ పై పెట్టుకున్న ఆశలు సైతం ఆవిరవుతున్నాయి. దీంతో ఇప్పుడు జగన్ కేంద్రంతో సంబంధాల విషయంలో పునరాలోచన చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు అలాంటి అవకాశాలు లేకపోయినా భవిష్యత్తులో విభజన హామీలపై కేంద్రం చేస్తున్న మోసంపై వైసీపీ స్పందించి తీరాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications