ఏపీలో వాలంటీర్లకు జగన్ సర్కార్ భారీ షాక్- 35 ఏళ్లు దాటితే ఇంటికే- తొలగింపుకు ఆదేశం
ఏపీలో గ్రామ స్వరాజ్యం పేరుతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్ధకు అత్యంత కీలకమైన వాలంటీర్లకు ప్రభుత్వం ఏడాదిన్నరలోనే భారీ షాకిచ్చింది. ముందు ప్రభుత్వ ఉద్యోగానికి అవసరమైన వయసు ఉంటే చాలంటూ వాలంటీర్లను ఎంపిక చేసిన ప్రభుత్వం తాజాగా వారికి వయోపరిమితిని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తాజా ఆదేశాలతో గతంలో నియమించిన దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతారో తెలియని పరిస్ధితి. దీంతో ఇప్పుడు వారిలో ఆందోళన నెలకొంది.

ఏపీలో వాలంటీర్లకు సర్కారు షాక్...
ఏపీలో నవరత్నాల అమల్లో భాగంగా ప్రభుత్వం గతేడాది ఆగస్టు 15న వాలంటీర్ల వ్యవస్ధకు శ్రీకారం చుట్టింది. ప్రతీ 50 ఇళ్లకు ఒకరు చొప్పన వాలంటీర్లను గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ నియమించింది. వీరిని స్ధానికంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు అటాచ్ చేసింది. తమకు అప్పగించిన 50 ఇళ్ల పరిధిలో జనానికి ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందేలా చూడటం వీరి బాధ్యత. వీరికి నెలకు రూ.5 వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. దీన్ని త్వరలో పెంచుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో 35 ఏళ్లు దాటిన వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి.

18 నుంచి 35 ఏళ్ల లోపు వారికే ఉద్యోగం
18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వాలంటీరు సచివాలయం, వార్డు వాలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్.నవీన్కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో వాలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 18 ఏళ్ల లోపు ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు 35 ఏళ్లు నిండిన వారినీ గుర్తించే పని ప్రారంభమైంది. త్వరలోనే వీరిని తొలగిస్తారు. వీరి స్ధానంలో 18-35 ఏళ్ల మధ్య ఉన్న వారిని తీసుకోవాలని సచివాలయాలకు ఆదేశాలు అందాయి.

వైసీపీ నేతలకూ షాక్...
వాస్తవానికి వైసీపీ గతేడాది నియమించిన వాలంటీర్ల వ్యవస్ధలో పార్టీ కార్యకర్తలకే అగ్రస్ధానం కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్కారు.. తన తాజా నిర్ణయంతో సొంత పార్టీ నేతలకు సైతం షాకి్చ్చింది. ఇప్పటివరకూ వాలంటీర్లను సొంత పార్టీ కార్యకర్తల్లా అదిలించి, బెదిరించి ప్రభుత్వ పథకాలను తమ వారికి ఇప్పించుకుంటున్న నేతలకు కూడా ఈ నిర్ణయం ఓ రకంగా షాకిచ్చింది. ముఖ్యంగా 18 ఏళ్ల వయసు లేకపోయినా, వృద్ధులైనా వారిని తమ పరపతి ఉపయోగించి వాలంటీర్లుగా నియమించుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో గగ్గోలు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications