డాక్టర్లకు ఏపీ సర్కార్ షాక్-ఇక ప్రతీ రెండు గంటలకూ సెల్ఫీ పంపాల్సిందే
ఏపీలో ప్రభుత్వ వైద్యులకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ ప్రభుత్వ విధులకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బయోమెట్రిక్ విధానంలో డాక్టర్ల హాజరు నమోదు చేస్తున్నప్రభుత్వం దానికి తోడు అదనంగా మరో నిర్ణయం కూడా తీసుకుంది.
ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, యూహెచ్ సీలతో పాటు ఇతర ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు.. ఇకపై బయోమెట్రిక్ హాజరుతో పాటు సెల్ఫీలు కూడా తీసుకుని పంపాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదీ ప్రతీ రెండుగంటలకు ఓసారి సెల్ఫీలు తీసుకుని పంపాలని ప్రభుత్వం తరఫున వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు పంపారు. దీంతో ఇప్పుడు కచ్చితంగా వైద్యులు విధుల్లో ఉంటున్నట్లు తెలిసేలా ప్రతీ రెండు గంటలకోసారి సెల్ఫీలు తీసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే విధుల్లో లేనట్గుగానే పరిగణిస్తారు.
ప్రభుత్వం డాక్టర్లు విధులకు దూరంగా ఉంటూ ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారన్న కారణంతో తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా మహిళా డాక్టర్లు దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళల్ని సైతం రెండు గంటలకోసారి సెల్ఫీలు తీసి పంపాలని అడిగితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. పురుష డాక్టర్లు సైతం రెండు గంటలకోసారి సెల్ఫీలు తీసి పంపితే తమ విధులకు ఆటంకం కలుగుతుందని చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. అయితే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ ను అడ్డుకోవాలంటే మాత్రం ఇలాంటి కఠిన చర్యలు తప్పనిసరని మరికొందరు చెప్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేయడం, డ్యూటీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండటం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సెల్ఫీ ఆదేశాలు ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.