కడపలో జగన్కు షాక్: టిడిపిలోకి మేనమామ, వైసిపిపై సంచలన ఆరోపణ
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన మామ పీటర్ (దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి మేనత్త కొడుకు) ఝలక్ ఇచ్చారు. జగన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పీటర్ ఇటీవలి వరకు వైసిపిలో ఉన్నారు. ఆయన కడప కార్పొరేషన్లోని 23వ వార్డు నుంచి వైసిపి అభ్యర్థిగానే పోటీ చేసి గెలిచారు. సోమవారం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు.
కడప కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి కోసం వెళ్లిన తనకు పార్టీ నేతలు షాకింగ్ ప్రతిపాదన ముందు పెట్టారని చెప్పారు. రూ.కోటి ఇస్తే డిప్యూటీ మేయర్ పదవి గురించి ఆలోచిస్తామంటూ వైసిపి నేతలు చెప్పడంతో తాను ఏం చేయలేకపోయానన్నారు.
స్టాండింగ్ కౌన్సిల్ సభ్యత్వం కోసం నామినేషన్ వేస్తే ఒత్తిడి తెచ్చి మరీ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. కొన్ని డివిజన్లకు రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల మేర పనులు కేటాయించి, తన డివిజన్కు మాత్రం రూ.18 లక్షలు మాత్రమే విడుదల చేశారన్నారు.
తన సోదరుడు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండేవారని, అయితే టిడిపి సర్కార్ వచ్చాక ఆయనను మార్చాలని కొందరు యత్నించగా, చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నారన్నారు. తన సోదరుడిని ప్రభుత్వ సలహాదారుగానే కొనసాగించారన్నారు. ఇక పులివెందులలోని వైయస్సార్ డిగ్రీ కళాశాలకు ఎయిడ్ ఇవ్వడంతో పాటు 125 పోస్టులకు ఇచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.