గ్రామ సచివాలయాల్లో సీన్ రివర్స్ - కౌంటింగ్ వేళ బిగ్ హింట్..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలుమారుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. గెలుపు పైన పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత ప్రారంభించిన సచివాలయ వ్యవస్థలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ తన ఎన్నికల ప్రచారంలో సచివాలయ వ్యవస్థ గురించి ప్రధానంగా ప్రచారం చేసారు. తాజాగా సచివాలయాల్లో చోటు చేసుకున్న పరిణామం చర్చగా మారింది.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు...భవనాలు..స్థలాల రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎలాంటి అదనపు సొమ్ము లేకుండానే రిజిస్టర్ చేయించుకొనేలా నిర్ణయించారు. అయితే, ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ విధానం ఆరంభశూరత్వంగా మిగిలింది . విలువైన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ పనులు సులభతరం అవుతాయని భావించిన ప్రజలకు ఆ ఆనందం ఎంతోకాలం మిగల్లేదు. ప్రభుత్వం ప్రకటించినదానికి, ఆచరణకు పొంతన కుదరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా స్ధానికంగా గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రయ, విక్రయ దారులు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.

కరువైన స్పందన
రాష్ట్ర వ్యాప్తంగా 3645 సచివాలయాల్లో దశల వారీగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద 2022 పిబ్రవరిలో 56 గ్రామ వార్డు సచివాలయాల్లోనూ, రెండోదశ కింద మరో 1600 సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. వాటిల్లో తూతూ మంత్రంగా 4996 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సరాసరి ఒక్కో సచివాలయంలో రెండు రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదని లెక్కలు చెబుతున్నాయి.భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో తొలుత కొంత మేర రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ అనంతరం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు కరువయ్యారు. ఒక వైపు భూములు, ఆస్తులు అమ్ముకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తున్నారే తప్ప సచివాలయాలకు వెళ్లడం లేదు.
ప్రభుత్వం వాట్ నెక్స్ట్
దీనికితోడు గ్రామవార్డు సచివాలయాల్లో రికార్డుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తమ ఆస్తుల డాక్యుమెంట్లకు రక్షణ కరువవుతుందనే ఆందోళన కూడా రిజిస్ట్రేషన్ల తగ్గుదలకు కారణమనే వాదన ఉంది. గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అమలవుతున్న 1.0 వెర్షన్ స్దానంలో కార్డ్ ప్రైమ్ సిస్టమ్ను తెరపైకి తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా ఉంటుందని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్లకు జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో 2.0 వెర్షన్కు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిష్కరించకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి గండిపడినట్లయ్యింది.












Click it and Unblock the Notifications