వివేకా హత్య కేసు- 28 తర్వాత మరిన్ని ట్విస్టులు ? నిందితులు హైదరాబాద్ కు షిఫ్ట్ ?
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సీబీఐ సిద్దమవుతోంది. ప్రస్తుతం కడప జైల్లో ఉన్న నిందితుల్ని హైదరాబాద్ కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇన్నాళ్లూ తీవ్ర ఒత్తిళ్ల మధ్య దర్యాప్తు కొనసాగించిన సీబీఐ హైదరాబాద్ కు విచారణ మారిన నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపిన సీబీఐ అధికారులు.. త్వరలో నిందితుల్ని కడప నుంచి హైదరాబాద్ తరలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే విచారణను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు పావులు కదుపుతోంది.

సీబీఐ దర్యాప్తు ముమ్మరం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఏపీలో ఉండగా రాజకీయ ఒత్తిళ్లతో రెండున్నరేళ్లుగా నత్తనడకన సాగిన ఈ కేసులో ఇప్పుడు సీబీఐ వేగం పెంచింది. ఇన్నాళ్లు అనుమానితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులి ఇచ్చేందుకు సైతం సాహసించని సీబీఐ... ఇప్పుడు హైదరాబాద్ కు దర్యాప్తు మారగానే నోటీసులు పంపింది. దీంతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. దీంతో అతి త్వరలోనే వివేకా కేసు తేలిపోతుందని భావిస్తున్నారు.

సీబీఐ ముందుకు వైఎస్ అవినాష్ ?
బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి త్వరలో సీబీఐ ముందు హాజరయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ కు నోటీసులు పంపిన సీబీఐ.. ఆయన నాలుగు రోజులు గడువు కోరడంతో మరోసారి నోటీసులు పంపింది. ఈసారి జనవరి 28న విచారణకు హైదరాబాద్ రావాలని సూచించింది. దీంతో అవినాష్ హైదరాబాద్ వెళ్లి సీబీఐ ముందు హాజరుకాబోతున్నారు. అయితే అవినాష్ ను ఒక్కరోజు విచారణకు సీబీఐ పరిమితం చేస్తుందా లేక రెండు, మూడు రోజులు విచారిస్తుందా, అరెస్టు చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది.

హైదరాబాద్ కు నిందితులు ?
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను సీబీఐ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించారు. అలాగే నిందితుల్ని కూడా కడప జైలు నుంచి హైదరాబాద్ తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు చేసిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరికి కడప జైల్లో ముప్పు పొంచి ఉందని సీబీఐ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా కోర్టుకు చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు నిందితుల్ని హైదరాబాద్ లోని చంచల్ గూడ లేదా చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి విచారణ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications