బిగ్బాస్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు: పెడదారి పట్టించేలా : విచారణకు నిర్ణయం..!!
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్బాస్ లాంటి రియాల్టీ షోలతో యువత పెడదారిపడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి షోలతో సమాజంలో ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. బిగ్బాస్ షోను నిలిపేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ చేయాలని నిర్ణయించింది. అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేలా బిగ్ బాస్ షో ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019 లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది శివప్రసాద రెడ్డి ధర్మాసనంకు నివేదించారు. బిగ్బాస్ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని పైన ధర్మానసం స్పందించింది. మంచి వ్యాజ్యం వేశారంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలతను పెంచుతున్నాయని అభిప్రాయపడింది. ఇలాంటి షోలతో మనకేం పని అని ప్రజలు భావిస్తున్నారని.. సమాజంలోని ఇతరుల గురించి పట్టించుకోకపోతే.. భవిష్యత్తులో ఏదైనా సమస్య మనకు ఎదురైనప్పుడు ఇతరులు పట్టించుకోరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇన్ని రోజులు ఎవరూ ఎందుకు స్పందించలేదని అనుకుంటున్నామని పేర్కొంది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. సంబంధిత వ్యాజ్యంపై సోమవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. దీంతో..గతంలోనూ బిగ్ బాస్ పైన సీపీఐ నారాయణ లాంటి వారు తీవ్రంగా స్పందించారు. అనేక రకాలుగా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, షో మాత్రం ఆపలేదు. ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయస్థానంకు చేరటం.. కోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేయటం..విచారణకు నిర్ణయించటంతో.. ఇప్పుడు కోర్టు ఏ రకంగా దీని పైన మార్గనిర్దేశనం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.