గోరంట్ల మాధవ్ వీడియో గురించి అడిగిన నారా బ్రాహ్మణి: లోకేష్ ఏం చెప్పారంటే..?
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారానికి కారణమైన అంశం- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్. దీనిపై చెలరేగిన వివాదాలు తగ్గట్లేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి రోజూ స్పందిస్తూనే వస్తోన్నారు. ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూనే ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకునేంత వరకూ వదిలేది లేదంటూ టీడీపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.
ఈ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ అనంతపురం జిల్లా పోలీసులు ప్రకటించినప్పటికీ.. టీడీపీ నాయకులు మాత్రం వెనుకంజ వేయట్లేదు. దీన్ని ఎంతగా జనంలోకి తీసుకెళ్లగలిగితే అంతగా రాజకీయంగా లబ్ది పొందగలమనే అభిప్రాయం వారిలో బలంగా నాటుకుపోయింది. రాజకీయంగా గోరంట్ల మాధవ్ను బలహీనపర్చడం ద్వారా.. హిందూపురం లోక్సభ పరిధిలో పట్టును పెంచుకోవచ్చని భావిస్తోన్నారు. వచ్చే ఎన్నికల్లో మాధవ్ వీడియో కాల్స్ వివాదాన్ని ఖచ్చితంగా ప్రచారాస్త్రంగా మార్చుకుంటామనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.
అటు మాధవ్ కూడా ఈ విషయంపై ఎదురుదాడికి దిగుతోన్నారు. ఓటుకు నోటు కేసు విషయాన్ని ఆయన తెర మీదికి తీసుకొస్తోన్నారు. ఈ కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడి ఆడియోను అమెరికా ల్యాబ్లో పరీక్షించే దమ్ము ఉందా? అని ప్రశ్నిస్తోన్నారు. ఈ ఆడియోను నకిలీదని నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. బీసీలను అణగదొక్కాలనే కుట్రతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోనే ఒరిజినల్గా అమెరికా ల్యాబొరేటరి తేల్చిందంటూ కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శించారు.
పదవీ విరమణ తరువాత వెంకయ్య నాయుడు ఏం చేస్తున్నారంటే..: అలా ఎంజాయ్..!!
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్ వివాదాన్ని ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, వేధింపులు ఏ రేంజ్లో పెరిగిపోయాయనడానికి ఈ ఉదంతం ఓ నిదర్శనంగా చెప్పుకొచ్చారు.
గోరంట్ల మాధవ్కు చెందిన న్యూడ్ కాల్స్ వీడియోలను రోజూ వెయ్యిమంది తన ఫోన్కు పంపించేవారని, వాటిని చూడలేక చచ్చానని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏంటీ ఆ వీడియో అంటూ బ్రాహ్మణి సైతం తనను అడిగిందని చెప్పారు. వద్దులేమ్మా నీకీ గోల.. అని బదులిచ్చానని అన్నారు. రోజూ వెయ్యిమంది వాటిని తన ఫోన్కు పంపించగా.. వాటిని తన సెల్ ఫోన్ నుంచి డిలేట్ చేశానని నారా లోకేష్ నవ్వుతూ చెప్పారు.