జగన్, చంద్రబాబుకు బీజేపీ పరీక్ష ? నెగ్గితేనే వైసీపీకి మద్దతు-టీడీపీతో పొత్తూ !
ఏపీలో తాను అధికారంలో లేకపోయినా, వచ్చే అవకాశాలూ లేకపోయినా ఇక్కడ ఎవరు అధికారంలో ఉండాలనేది మాత్రం బీజేపీ పరోక్షంగా నిర్ణయిస్తోంది. రాష్ట్ర బీజేపీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు.. ఏపీ రాజకీయాల్ని పరోక్షంగా శాసిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావాలనుకునే పార్టీ తప్పకుండా బీజేపీ సాయం తీసుకోక తప్పని పరిస్ధితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మద్దతు వైసీపీకా లేక టీడీపీకా అన్న చర్చ సాగుతోంది.
టీడీపీ, వైసీపీలకు బీజేపీ మద్దతు
ఏపీ విభజన తర్వాత మారిన పరిస్ధితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీకి కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి గానీ బీజేపీ మద్దతు ఉందనేది అక్షర సత్యం. బీజేపీ ప్రత్యక్ష మద్దతుతో 2014లో టీడీపీ అధికారంలోకి వస్తే.. 2019లో బీజేపీ పరోక్ష మద్దతుతో వైసీపీ అధికారంలోకి వచ్చిందనేది నిర్వివాదాంశం. దీంతో 2024లో ఈ రెండు పార్టీల్లో ఎవరికి కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇవ్వబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో అధికార పార్టీ మద్దతు లేకుండా ఈ రెండు పార్టీలు స్వతంత్రంగా గెలిచే అవకాశాలు లేవనే చర్చ కూడా జరుగుతోంది.
ప్రస్తుత రాజకీయం
రాష్ట్రంలో 2019లో ప్రజాబలంతో పాటు తమ మద్దతుతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి బీజేపీ పరోక్షంగా సహకరిస్తోంది. సీఎం జగన్ కోరినప్పుడల్లా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్లు ఇస్తున్నారు. కానీ రాష్ట్రానికి వచ్చే బీజేపీ అగ్ర నేతలు మాత్రం జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో గతంలో తమతో అంటకాగి ఆ తర్వాత దూరమైన టీడీపీవైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడటం లేదు. అలాగని టీడీపీని పూర్తిగా దూరం చేసుకునే పరిస్ధితుల్లో బీజేపీ లేదు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వైసీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీని పలకరించని బీజేపీ.. భవిష్యత్తులో టీడీపీకి మంచిరోజులు వస్తే తిరిగి ఆ పార్టీతో అంటకాగేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
జగన్, చంద్రబాబుకు బీజేపీ పరీక్ష ?
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ తో పాటు విపక్షంలో ఉన్న చంద్రబాబుకూ బీజేపీ పరీక్ష పెడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు బలంగా ఉంటే, ఎవరికి ప్రజామద్దతు ఎక్కువగా ఉందని భావిస్తే వారికి అండగా నిలిచేందుకు బీజేపీ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాల్లో ముఖాముఖీ తలపడుతున్న వైసీపీ, టీడీపీల్లో ఎవరో ఒకరికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో ప్రజాదరణ ఉండే అవకాశం ఉంది. గతంలోనూ ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పులే ఇచ్చారు. దీంతో ప్రజాదరణ ఎక్కువగా ఉన్న పార్టీకే అండగా నిలవడం ద్వారా కేంద్రంలో వారి మద్దతు తీసుకోవాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.