కన్నా లక్ష్మీనారాయణకు తేల్చి చెప్పిన హైకమాండ్..!!
ఏపీ బీజేపీలో వివాదాల పైన పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పైన సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ ముఖ్య నేతలు మార్గనిర్దేశం చేసారు. జనసేన అధినేత పవన్ తో సమ్వయం చేసుకోవటంలో బీజేపీ రాష్ట్ర నేతలు విఫలమయ్యారని కన్నా వ్యాఖ్యానించారు. జనసేనో సంబంధాల నిర్వహణలో లోపం ఉందనే అంశాన్ని ప్రధానంగా కన్నా ప్రస్తావించారు. దీని పైన సోము వీర్రాజు స్పందిస్తూ పార్టీ అధినాయకత్వం కన్నా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే, పార్టీ ముఖ్య నేతలు కన్నాతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక నుంచి పార్టీ వ్యవహారాలు మీడియాలో మాట్లాడవద్దని నిర్దేశించారు. జనసేనతో బంధం విషయంలో ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి రెండు పార్టీల మధ్య సఖ్యత - సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా కన్నా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని పార్టీ ముఖ్యనేతలు హామీ ఇచ్చారు. దీంతో..కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతానికి తన కార్యాచరణ వాయిదా వేసుకున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ తాను అడిగిన రూట్ మ్యాప్ ఇవ్వలేదని వ్యాఖ్యానించటం.. కొత్త కార్యాచరణ తో ముందుకు వెళ్తామని చెప్పటంతో పాటుగా ఆ వెంటనే చంద్రబాబు నేరుగా వచ్చి పవన్ కళ్యాన్ తో మంతనాలు చేయటంతో కన్నా స్పందించారు.
సోము వీర్రాజు పైన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో చర్చ మొదలైంది. కన్నా బీజేపీ నుంచి బయటకు రావాలంటూ ఆయన మద్దతు దారుల నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ సమయంలోనే కన్నా బీజేపీ వీడి మరో పార్టీ వైపు ఆలోచన చేస్తున్నారనే ప్రచారమూ ప్రారంభమైంది. కానీ, ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం నుంచి వచ్చిన సూచనలతో ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉండాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది.