వెంకయ్య ఏపీలో బీజేపీని చంపేశారు: పవన్, బీజేపీ నేతలకు ఢిల్లీ పిలుపు
అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ సభ కేంద్రాన్ని కదలించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ 'సీమాంధ్ర ఆత్మగౌరవ సభ' కారణంగా శనివారం ఉదయానికల్లా ఢిల్లీకి రావాలంటూ బీజేపీ నేతలు, బీజేపీ శానససభాపక్ష నేతకు పిలుపొచ్చింది.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని తాజా పరిణామాలను బీజీపీ అధిష్టానం తీవ్రంగా పరిగమిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నేతలు ఢిల్లీకి రావాలంటూ హైకమాండ్ ఆదేశించింది. దీంతో మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాల రావు, విష్ణుకుమార్ రాజు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, ఇతర ప్రముఖులతో నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీపై కాస్తంత తీవ్రంగానే స్పందించారు.
అధికారంలోకి వస్తే అన్నీ హ్యాపీడేస్ అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు అరచేతిలో స్వర్గం చూపించారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారు చెప్పిన హ్యాపీ డేస్ ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేటప్పుడు అర్ధమయ్యే భాషలో మాట్లడతారని, ఏదైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం అర్థం కాకుండా మాట్లాడుతారని బీజేపీ నేతలను పవన్ ఎద్దేవా చేశారు.
అంతేకాదు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అంటే ఎంతో గౌరవం ఉందని చెబుతూనే ఆయనపై విమర్శలు సంధించారు. సీమాంధ్రులకు అన్యాయం జరుగుతున్నా వెంకయ్య మాట్లాడడం లేదని, ఆయన పెద్దరికం మీద వేసుకొని తిరుగుతున్నారని పవన్ దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా తాను వెంకయ్యకు వ్యతిరేకంగా మాట్లాడక తప్పడం లేదని పవన్ స్పష్టం చేశారు. మూడు నాలుగు సంవత్సరాలుగా హోదా ఇస్తామంటూ, తిపికబురు వస్తోంది అంటూ పాచి కంపు కొట్టే రెండు లడ్డూలిచ్చారని పవన్ అన్నారు. మీ పార్టీ ఇచ్చిన తీర్మానం కంటే భారత రాజ్యాంగానికి విలువ లేదా అని ప్రశ్నించారు.
చట్టసభలో చేసిన చట్టాల కంటే మీ హామీలే ఎక్కువా అని బీజేపీ నేతలను ప్రశ్నంచారు. దీనిని పైస్థాయి వరకు తీసుకెళ్తానన్నారు. ఎవరైనా ఇక్కడి వస్తే ఈ పాచీ లడ్డూలు వద్దని చెప్పండన్నారు. ఏపీకి హోదాపై పార్లమెంట్ లో నాటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రేపు వారు జనాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు వారికి లడ్డులు చూపిస్తే మొఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు ఏపీలో బీజేపీని చంపేశారని, ఏపీ బీజేపీ నేతలు వేరే పార్టీ చూసుకోవాలని వ్యాఖ్యానించారు.