చంద్రబాబు-పవన్ భేటీపై బీజేపీలో చీలిక ? వారికి నోటీసులంటూ లీకులు..!
ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రధాన విపక్షం టీడీపీ అధినేత చంద్రబాబుతో మరో విపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరువురూ పలు కీలక అంశాలపై చర్చించారు. త్వరలో పవన్ ప్రారంభించే వారాహి యాత్రతో పాటు ఇరు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు,సీట్లు వంటి అంశాలపైనా చర్చించినట్లు వార్తలొచ్చాయి. అయితే అసలు ఈ భేటీలో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనడంపై బీజేపీలో మిశ్రమ స్పందన వస్తోంది.
ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడంపై జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో మిశ్రమ స్పందన వచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మరికొందరు కీలక నేతలు ఆచితూచి స్పందించారు. అలాగే తాజాగా అమరావతిలో వైసీపీ నేతల చేతిలో దాడికి గురైన సత్యకుమార్ వంటి నేతలు ఈ భేటీలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ అయితే మరో అడుగు ముందుకేసి మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా చెప్పేశారు.

ఈ రియాక్షన్స్ ఇప్పుడు ఏపీ బీజేపీలోనే తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీతోనూ సమదూరం పాటించాలని పార్టీలో రాష్ట్రస్ధాయి నేతలు పదే పదే చెప్తున్నారు. అదే సమయంలో జనసేన మాత్రమే తమ మిత్రపక్షమని చెబుతూ వస్తున్నారు. కానీ అదే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పదే పదే చంద్రబాబుతో భేటీ అవుతుంటే అభ్యంతరం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న దానిపై సమాధానం లేదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు-పవన్ భేటీపై స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల పొత్తంటూ వ్యాఖ్యానించిన ఆదినారాయణ రెడ్డిపై అధిష్టానానికి మరికొందరు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. వీరు త్వరలో ఆదికి నోటీసులు వస్తాయంటూ మీడియాకు లీకులు కూడా ఇస్తున్నారు. తద్వారా ఈ మూడు పార్టీల పొత్తును వ్యతిరేకిస్తున్న నేతలు ఇప్పుడు తెరపైకి వచ్చి ఆ ప్రయత్నాలకు ఆదిలోనే బ్రేక్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధిష్టానం నిజంగానే స్పందించి నోటీసులు జారీ చేస్తుందా అంటే ఎవరి వద్దా కచ్చితమైన సమాధానం లేదు.












Click it and Unblock the Notifications