తిరుపతిలో గాజు గ్లాస్ గుర్తు వివాదం- ఈసీకి బీజేపీ-జనసేన ఫిర్యాదు
తిరుపతి ఉపఎన్నికలో జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ను నవతరం పార్టీకి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ-జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ఇతరులకు కేటాయించడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. దీనిపై ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇరుపార్టీలు ఫిర్యాదు చేశాయి.
తిరుపతి ఉపఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించడంపై ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇరుపార్టీల నేతలు కలిశారు. సీఈసీని కలిసిన వారిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ కూడా వీరితో పాటు ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికలో గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల బీజేపీ అభ్యర్ధికి నష్టం కలుగుతుందని వారు ఫిర్యాదు చేశారు.

తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీకి చెందిన రత్నప్రభ పోటీ చేస్తున్నారు. జనసేన పోటీ చేయని కారణంగా ఈసీ గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీ అభ్యర్ధికి కేటాయించింది. అయితే జనసేన బీజేపీకి మద్దతిస్తున్నా ఓటర్లు గందరగోళానికి గురై జనసేన గుర్తు అయిన గాజు గ్లాసుకు ఓటేసే ప్రమాదం ఉందని ఇరు పార్టీలు అనుమానిస్తున్నాయి. దీంతో ఈసీ వద్దే ఈ విషయాన్ని తేల్చుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications