బీహార్లో జేడీయూ-బీజేపీ ప్రభుత్వంపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఏర్పాటైన బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. జేడీయూ-బీజేపీ కూటమి ఎక్కవ కాలం కొనసాగదని జోస్యం చెప్పారు. జేడీయూ-బీజేపీ కూటమిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ-జేడీయూ ప్రభుత్వం జీవితకాలం కొన్ని నెలలు మాత్రమేనని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ నిలబడే అవకాశం తక్కువేనని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లో ఈ మార్పు కనిపిస్తుందన్నారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా నిరూపిస్తామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

2022లో ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన నితీశ్ కుమార్.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇలాగే కొనసాగితే సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 5 సీట్లు కూడా గెలవడం కష్టమని గతంలో చెప్పిన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ ఏ పార్టీతో కలిసి పోటీ చేసినా.. 20 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోలేరని స్పష్టం చేశారు.
అంతేగాక, ఒక వేళ తాను చెప్పిన సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాగా, ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చిన నితీష్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా నితీష్ కుమార్ తోపాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇండియా కూటమిపై అసంతృప్తి, ఆర్జేడీ నేతలతో విభేదాల కారణంగా నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో చేతులు కలపడం గమనార్హం.












Click it and Unblock the Notifications