టీడీపీ, వైసీపీ దొందూ దొందే ... బీజేపీ నేత , నటి కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ మహానాడు లో తనకు అవమానం జరిగిందని, కొందరు నేతలు చర్యలవల్ల టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నానని 2018లో బీజేపీలో చేరిన కవిత తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి దొందూ దొందే అని, వైసిపి పాలన, గత టీడీపీ పాలన రెండు ఒకే విధంగా ఉన్నాయని ఆమె ఆరోపణలు గుప్పించారు. తాను 17 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తే, తనకు సరైన న్యాయం జరుగలేదని బిజెపి నాయకురాలు, సినీ నటి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

17 ఏళ్ల పాటు టిడిపి కోసం నిస్వార్ధంగా సేవ చేసినా గుర్తింపు లేదన్న కవిత
తాజాగా కవిత మండపేట పట్టణ వైశ్య నేత కాళ్లకూరి నాగబాబు ఇంటికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 17 ఏళ్ల పాటు టిడిపి కోసం నిస్వార్ధంగా సేవ చేశానని, టీడీపీలో తనకు గుర్తింపు లభించలేదని పేర్కొన్న ఆమె రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ ఒంటరిగానే పోటీచేసి తెలుగు రాష్ట్రాల్లో గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుత జగన్ పాలనకు, గత చంద్రబాబు పాలనకు పెద్దగా తేడా లేదని విమర్శలు గుప్పించారు. అటు చంద్రబాబు పాలనలోనూ, ఇటు జగన్ పాలనలోనూ ప్రజావ్యతిరేక విధానాలు కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలే పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్తున్నారన్న కవిత
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి బలోపేతం అవుతుందని ఆమె తెలిపారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని కవిత అభిప్రాయపడ్డారు.ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతుందని ఎంతో కాలంగా నలుగుతున్న జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించిన ఘనత నరేంద్ర మోడీకే ఉందని ఆమె పేర్కొన్నారు. ఆయన పాలనలో తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పిన కవిత తమ పార్టీ ఎన్నడూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు.తనకు బీజేపీలో మంచి గుర్తింపును ఇచ్చారని, బిజెపి ప్రజారంజక పాలన సాగించగలదని ఆమె కితాబిచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పథకాలను, వాటి పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నాయని ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని బిజెపి నాయకురాలు, సినీ నటి కవిత పేర్కొన్నారు.

తాజా రాజకీయ పరిణామాలతో బీజేపీ నేతల్లో కొత్త జోష్ .. పార్టీలో యాక్టివ్ గా కవిత ?
బీజేపీలో చేరిన నాటి నుండీ పెద్దగా పార్టీ కార్యక్రమాలలో
పాత్ర తీసుకొని కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీలో బీజేపీ పుంజుకుంటున్న నేపధ్యంలో ఆమె కూడా యాక్టివ్ అయ్యారన్న సంకేతాలిస్తున్నాయి. ఏది ఏమైనా టీడీపీపై సంచలన ఆరోపణలు చేసి బయటకు వచ్చిన కవితకు 17 ఏళ్ళు సేవ చేసిన టీడీపీ అవకాశం ఇవ్వకున్నా బీజేపీ సముచిత స్థానం ఇస్తుందన్న నమ్మకంతో కవిత ఉన్నారు.












Click it and Unblock the Notifications