రాఫెల్ విమానాల ట్వీట్తో బీజేపీకి దొరికేసిన చంద్రబాబు- ఇంకెన్నాళ్లు యూ టర్న్లంటూ చెడుగుడు...
రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో గతంలో సఖ్యతగా ఉన్నప్పుడు తాడులా కనిపించినవి పాములా, పాములా కనిపించినవి తిరిగి తాడులా కనిపిస్తుంటాయి. ఇలాంటి ఓ సందర్భమే టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చింది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో కేంద్రాన్ని గతంలో తప్పుబట్టిన ఆయన తాజాగా వీటిని పొగుడుతూ చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది.
గతంలో కేంద్రంతో పాటు మూడున్నరేళ్ల పాటు అధికారం పంచుకున్న టీడీపీ.. ప్రత్యేక హోదా పేరుతో ఆ తర్వాత బయటికొచ్చేసింది. అంతటితో ఆగకుండా బీజేపీ, ఎన్డీయేపై ధర్మపోరాటం ప్రారంభించింది. ఇందుకు కాంగ్రెస్ సాయం కూడా తీసుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే రాఫెల్ జెట్లును కొనుగోలు చేసేందుకు ఎన్డీయే సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీన్ని కేంద్రంలో విపక్ష కాంగ్రెస్ కుంభకోణంగా పేర్కొంటూ రచ్చరచ్చ చేస్తోంది. ఇదే అదనుగా కాంగ్రెస్ వాదన అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో స్కామ్ చేస్తోందని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబును బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది.
తాజాగా గతేడాది ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత చతికిలపడిన టీడీపీని తిరిగి ఎన్డీయేకు దగ్గరచేసేందుకు చంద్రబాబు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాజాగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన రాఫెల్ జెట్లను దేశం గర్వించదగిన యుద్ధ విమానాలు అంటూ ట్వీట్ చేశారు. అసలే ఏపీలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలు దీన్ని అందుకుని చంద్రబాబును ఆడుకోవడం మొదలుపెట్టేశారు. యూ టర్న్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు, ఇంకెన్నేళ్లు బాబు అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ట్విట్టర్లో చంద్రబాబును ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం, తన స్వార్ధ మిత్రపక్షం కాంగ్రెస్ మెప్పుకోసం రాఫెల్ ఓ కుంభకోణం అంటూ ట్వట్ చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక దేశం గర్వించదగ్గ యుద్ధ విమానం రఫేల్ అంటూ మరో ట్వీట్తో పొగుడుతున్నారు. యూటర్న్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు అని విష్ణు చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.