కేంద్రం నిధులు బ్యాంకుల్లో పెట్టి వడ్డీ: బాబుపై వీర్రాజు సంచలనం, అమిత్షాకు ఫిర్యాదు
గుంటూరు/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నాయకులు టిడిపిని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా మోర్చ నేత పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు టిడిపి పైన గురువారం ప్రత్యక్షంగా, పరోక్షంగా నిప్పులు చెరిగారు.
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని బిజెపి నేతలు అధినాయకత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులకు పెట్టే ఖర్చు పైన లెక్కలు తేల్చేందుకు దర్యాఫ్తు చేయించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టేలా జోక్యం చేసుకోవాలని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రెండింతలకు పైగా పెంచిందని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది.
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పైన ఖర్చు లెక్కలను పోలవరం అథారిటీకి కూడా చెప్పడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ ఖర్చు లెక్కల పైన అధ్యయనం చేయించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగమని చెప్పినప్పుడు... దాని లెక్కలు పోలవరం అథారిటీకి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ... పోలవరంలో పట్టిసీమ అంతర్భాగమైనప్పుడు కేంద్రం నుంచి రూ.1900 కోట్లు నిధులు మంజూరు చేయించుకుందని, వాటి లెక్కలు పోలవరం అథారిటీకి ఎందుకు చెప్పడం లేదన్నారు.
ప్రాజెక్టు ఖర్చు లెక్కలు చెప్పే విషయంలో తప్పించుకుంటోందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16వేల కోట్లుఉండగా, ఏ లెక్కల ప్రకారం రూ.36వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందో చెప్పాలన్నారు. పోలవరం స్పిల్ వే పనులను ప్రారంభించకుండా బిజెపిపై నిందలు వేసే ప్రయత్నం సహించమన్నారు.
అన్ని విషయాలు కేంద్రానికి వివరిస్తామన్నారు. ఏపీలోని డు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రూ.50వేల కోట్ల చొప్పున విడుదల చేసిన రూ.350 కోట్ల నిధులను జిల్లాల్లో అభివృద్ధి పనులకు వినియోగించకుండా బ్యాంకులో పెట్టి వడ్డీ తీసుకుంటోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దీనిపై జగన్ మాట్లాడాలన్నారు.
పురందేశ్వరి కూడా పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై మొదటి నుంచి విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ఏపీకి సహకరిస్తోందని, ప్రత్యేక హోదా, ప్యాకేజీ పక్కన పెట్టి... అభివృద్ధి కోసం పని చేయాలని హితవు పలుకుతున్నారు.