గుర్రం ముందుకు.. బండి వెనక్కి: కెసిఆర్పై లక్ష్మణ్, నాగం, కోట్లు మిగిల్చుకున్నారని..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఆరు నెలల పాలన దారుణంగా ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గుర్రం ముందుకు, బండి వెనక్కిలా కెసిఆర్ ప్రభుత్వం పాలన ఉందని ఎద్దేవా చేశారు.
డబ్బులు మిగుల్చుకున్నారు: నాగం ఫైర్
సమగ్ర కుటుంబ సర్వేతో కెసిఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సర్వే విజయవంతమైతే పింఛన్లు ఎందుకు ఆలస్యమయ్యాయని అన్నారు.
పింఛన్లు కోత పెట్టి రూ. 2,400 కోట్లును కెసిఆర్ మిగిల్చుకున్నారని నాగం ఆరోపించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పరిశ్రమలను తీసుకోస్తామని చెప్పిన సిఎం కెసిఆర్.. ఇప్పటి వరకు ఏమి చేయలేదని అన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సిఎం ఒక్కసారీ సమీక్ష జరపలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ రైతుల పొలాల్లో అడుగుపెట్టలేదని నాగం జనార్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.
విమర్శించే హక్కు లేదు: జోగు రామన్న
ముఖ్యమంత్రి కెసిఆర్ను విమర్శించే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బిజెపి, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై వివక్ష చూపిస్తున్నాయని ఆరోపించారు.