రాష్ట్ర విభజనకు ముందే కమలదళం విభజన?
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముందే రెండు శాఖలను ఏర్పాటు చేయాలని బిజెపి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెంలగాణకు, సీమాంధ్రుకు విడివిడిగా శాఖలను ఏర్పాటు చేసే యోచనలో బిజెపి నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన రహస్య సమావేశంలో ఈ విషయంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో రెండు ప్రాంతాలకు ఒకే వేదిక ప్రాతినిధ్యం వహించడం అసంబద్ధంగా ఉంటుందనే భావనకు నాయకత్వం వచ్చినట్లు సమాచారం.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయని, వాటిని ఒకే శాఖ ప్రస్తావించడమూ వాటిని ముందుకు తీసుకుని రావడం సాధ్యం కాదని అంటున్నారు. తెలంగాణ శాఖ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడానికి తగిన ప్రణాళికను, ఈ విషయంలో కాంగ్రెసు జాప్యా్ని నిరసిస్తూ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేస్తే, సీమాంధ్ర శాఖ తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు.
సీమాంధ్రలో గానీ, తెలంగాణలో గానీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే వెసులుబాటును కల్పించుకోవడానికి కూడా రెండు శాఖల ఏర్పాటు వల్ల ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నారు. ఇరు ప్రాంతాల ప్రాధాన్యతలు మారి, అవి భిన్నంగా ఉన్న సమయంలో ఒకే శాఖ నుంచి పనిచేయడం సాధ్యం కాదని పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గేమ్ ప్లాన్కు అనుగుణంగా రాష్ట్రంలో రెండు శాఖలను ఏర్పాటు చేసే ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ శాఖకు ప్రస్తుత రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి నాయకత్వం వహిస్తారని అంటున్నారు. సీమాంధ్ర శాఖ అధ్యక్ష పదవి కోసం హరిబాబు, సోమ్ వీర్ రాజు, సురేష్ రెడ్డి పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తీరులో కాంగ్రెసు చేసిన తప్పిదాలను ఎత్తి చూపడానికి ప్రత్యేకంగా సీమాంధ్ర శాఖ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.