పవన్ కళ్యాణ్ ఏంచెప్తే అది: జనసేనలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల, మరో బీజేపీ నేత శుభాకాంక్షలు
అమరావతి: భారతీయ జనతా పార్టీకి రాజీనామా (బీజేపీ) చేసిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆకుల తన సతీమణితో కలిసి జనసేన కండువా కప్పుకున్నారు. పవన్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు చెప్పారు.
300 కార్లతో ర్యాలీగా వచ్చారు
ఆకుల సత్యనారాయణ, ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతిలు దాదాపు 300 కార్లతోరాజమండ్రి నుంచి విజయవాడకు ర్యాలీగా వచ్చారు. అనంతరం జనసేనలో చేరారు. విజయవాడలోని పరిణయ కళ్యాణ వేదికలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆకుల సత్యనారాయణ కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని, అలాంటి కుటుంబం తమ పార్టీలో చేరడం వల్ల జనసేన మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆకులకు మద్దతు ఇచ్చానని, ఇప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉండి ప్రోత్సహిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆకుల దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు.
పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి
పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానని, పవన్ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళణ చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆకుల చెప్పారు. ఏపీలో సంక్షేమ పథకాల్లో అవినీతి రాజ్యం ఏలుతోందన్నారు. అవినీతికి తావులేకుండా చేయడం పవన్ వల్లే సాధ్యమని చెప్పారు. స్వార్థ రాజకీయాలు, ఓటు బ్యాంకు కోసం కొంతమంది నాయకులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా పవన్ మాత్రమే ఆలోచిస్తున్నారని చెప్పారు. పారదర్శక పాలన జనసేనానితో సాధ్యమన్నారు.
ఆకులకు విష్ణు శుభాకాంక్షలు
ఆకుల సత్యనారాయణ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి ఇదివరకే రాజీనామా చేశారు. తాను బీజేపీని వీడుతున్నట్టు గతంలోనే ప్రకటించారు. నిన్న అధికారికంగా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేశాయి. బీజేపీ తరఫున నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస రావు, ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు గెలిచారు. వారిలో మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ మంత్రులు అయ్యారు. విష్ణుకుమార్ రాజు పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అయ్యారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య విబేధాలు రావడంతో కామినేని, మాణిక్యాలరావు ఇద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆకుల ఇప్పుడు జనసేనలో చేరారు. కాగా, జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణకు బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ కూడా జనసేనలో చేరారు.