"విసిగిపోయాను! సీఎంకు చెప్పినా.. చిత్తు కాగితాల్లా పక్కన పడేశారు"
స్కూళ్లకు 100మీ. పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతులివ్వకూడదని చెప్పినా.. లైసెన్స్ మంజూరు చేశారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.
విశాఖ: విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటోంది ఏపీ సర్కార్. మిత్రపక్షమైన బీజేపీ నేతలు సైతం ఈ విషయంలో టీడీపీని దుయ్యబడుతుండటం గమనార్హం. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
స్కూళ్లకు 100మీ. పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతులివ్వకూడదని చెప్పినా.. లైసెన్స్ మంజూరు చేశారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తన నియోజకవర్గంలో 8మద్యం దుకాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రం ఇచ్చినట్లుగా చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా లైసెన్స్ లు ఇవ్వడం పట్ల తాను విసిగిపోయానని అన్నారు.
' ఈ నెల 17న విమానశ్రయంలో సీఎంకు వినతిపత్రం ఇచ్చాను. నా నియోజకవర్గంలో 13బార్లు, 14వైన్ షాప్స్, ఉన్నాయి. అందులో 8మద్యం షాపులు వద్దంటూ వినతిపత్రం ఇచ్చాను. అధికారులు మాత్రం మా లేఖలను చిత్తు కాగితాల లాగా తీసి పడేశారు.' అని విష్ణుకుమార్ రాజు అన్నారు. అశోకా వైన్స్కు లైసెన్స్ ఇచ్చేశారని, ఏదైనా మేం వినతిపత్రం ఇస్తే బుట్టదాఖలు చేయొద్దని అన్నారు.
విశాఖలో వైన్స్ మాఫియాను ఎక్సైజ్ సూపరిండెంట్ అడ్డుకుంటున్నా.. అమరావతి నుంచే నేరుగా ఆర్డర్లు పొంది లైసెన్స్ లు తెప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.