జనసేనకే మద్దతు: దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే భార్య, బాబు పట్టించుకోవట్లేదు, మీరైనా: మోడీకి పవన్
శ్రీకాకుళం: ఉద్ధానం సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన దీక్షకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల లక్ష్మీ పద్మావతి రాజమహేంద్రవరంలో జనసేన దీక్షలో పాల్గొన్నారు. పవన్ ఒక్కరోజు దీక్షకు మద్దతు పలుకతూ ఆమె జనసేన కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పారు. అందుకే ఆయనకు మద్దతుగా దీక్షకు కూర్చున్నానని చెప్పారు. ఈ విషయం తన భర్తకు తెలుసునని, ఆయన పార్టీ ఆయనదే, తన నిర్ణయం తనదేనని చెప్పారు.
నేను భవిష్యత్తులోను జనసేనకు మద్దతు తెలపుతా
2014 సార్వత్రిక ఎన్నికల్లోను పవన్ కళ్యాణ్ తరఫునే బీజేపీకి మద్దతు తెలిపానని, ప్రచారం కూడా చేశానని ఆమె చెప్పారు. తాను రాజకీయాల్లోకి రానని తెలిపారు. పవన్ విధానాలు నచ్చి తాను మద్దతు తెలుపుతున్నానని వ్యాఖ్యానించారు. తాను పవన్ నుంచి ఎలాంటి గుర్తింపు, పదవులు కోరుకోవడం లేదని చెప్పారు. భవిష్యత్తులోను జనసేనకు మద్దతుగా పని చేస్తానని చెప్పారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే పవన్ దీక్షకు మద్దతు తెలపడం గమనార్హం. పవన్ దీక్షకు మద్దతుగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆకుల లక్ష్మీపద్మావతి దీక్ష చేపట్టారు.
బాబు వల్లే ఏం కావడం లేదు, పవన్ సీఎం కావాలి
మరోవైపు, పవన్ దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మధు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్తో బాటు పలు సంఘాలు పవన్ కళ్యాణ్కు సంఘీభావం తెలిపాయి. ఉద్దానంలో కిడ్నీబారిన పడి మృతి చెందిన కుటుంబానికి చెందిన బాలుడు సిద్ధార్ధ చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని సాయంత్రం ఐదు గంటలకు పవన్ దీక్ష విరమించారు.
చంద్రబాబు పట్టించుకోవట్లేదు, అందుకైనా..
అంతకుముందు, పవన్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఉద్దానంలో మూత్ర పిండాల వ్యాధులతో ప్రజలు మరణిస్తున్నారని, వారిని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇలాంటి పరిస్థితులు చూసైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పవన్ కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రజలకు సంతోషంగా జీవించే హక్కులేదా అని ప్రధానిని ప్రశ్నించారు. శ్రీకాకుళం వెనకబడిన జిల్లా, ఏం తిట్టినా పట్టించుకోరనుకుంటే ప్రజాక్షేత్రంలో ఏదో ఒకరోజు లెక్క తేలుస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
కావాలంటే అలా చేసి నిధులివ్వండి
ప్రధాని మోడీకి చెబుతున్నానని, ఏపీకి ఎందుకు ప్రత్యేక కావాలని మీరు అడుగుతున్నారని, రెండు దశాబ్దాలుగా ఉద్దానంలో ప్రజలు మరణిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవంటోందని, ఉన్న నిధులు వాళ్లకే సరిపోతున్నాయని, మీరేమో చంద్రబాబు మీద కోపంతో ఏపీకి నిధులు ఇవ్వరని, ఇక్కడేమో ప్రజలు చచ్చిపోతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. మీరు నిధులివ్వండని, కావాలంటే ఆ నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ కమిటీని నియమించండని కోరారు. ఒకటిన్నర దశాబ్దం కాలంలో ఇరవై వేల మందికి పైగా చనిపోయారని, మాది జబ్బు అని తెలుసుకునే పరిస్థితుల్లో లేరంటే అంతకు మించి వెనకబాటుతనం ఏముందన్నారు.
తన్ని తన్ని తగలేస్తారని హెచ్చరిక
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోకుంటే ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు తన్ని తన్ని తగలేస్తారని పవన్ హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారం కావాలనేది జనసేన కోరిక కాదని, సహజంగా వచ్చిందా సంతోషమని, బాగా చేస్తామన్నారు. కానీ దానికంటే ముందు ఒక సామాజిక రాజకీయ చైతన్యం కోసం ఈ రోజు పార్టీ పోరాడుతోందన్నారు. టీడీపీ మంచి పాలన అందిస్తారని మద్దతిచ్చానని, కానీ వారు నామ్కే వాస్తేగా స్వల్పంగానే చేస్తున్నారని, ప్రతి మండలానికి ఒక డయాలసిస్ యూనిట్ కావాలని, ప్రభుత్వాల నుంచి సొమ్ములు తీసుకుంటున్న కార్పొరేట్ ఆస్పత్రులకు సామాజిక బాధ్యత లేదా అని ప్రశ్నించారు. వారికి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. చంద్రబాబు ముందు కౌగలించుకుని వెనక నుంచి కత్తులతో పొస్తారన్నారు. దయచేసి ఈ పద్ధతి మానుకోవాలన్నారు. త్రికరణ శుద్ధిగా ఉండండని, మేం చేతకాని వాళ్లం కాదన్నారు.