ఏపీలోనూ డబుల్ ఇంజన్ సర్కార్-బీజేపీ వ్యూహాలపై ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ వరుస యాత్రలతో హంగామా చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలో నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ తరహా యాత్రల్ని ఏపీలోనూ ప్లాన్ చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో సత్తా చాటుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రభుత్వం లేక ఏపీ అన్నిరంగాల్లోనూ వెనుకబడిందన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని జీవీఎల్ తెలిపారు. వైసీపీ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ-జనసేనే అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని జీవీఎల్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల ర్యాలీలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న బీజేపీ త్వరలో రాయలసీమప్రాజెక్టుల పూర్తి కోరుతూ యాత్ర చేపట్టబోతోందని సోము వీర్రాజు తాజాగా సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లోనూ యాత్రలు పెడతామన్నారు. ఇందులో భాగంగానే 5 వేల సభలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే అమరావతి రాజధానిపై ఫోకస్ పెట్టిన బీజేపీ నేతలు.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications