పార్క్ హయత్ మీటింగ్ పై సుజనా క్లారిటీ- రెండు వేర్వేరు మీటింగ్స్ కలిపేశారంటూ ఆగ్రహం..
ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ భేటీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. కరోనా కారణంగా పార్క్ హయత్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాను ఇద్దరు వేర్వేరు వ్యక్తులను వేర్వేరుగా కలిస్తే దాన్ని కలిపి చూపడం ద్వారా రాజకీయాలు చేస్తున్నారని మీడియా, వైసీపీ నేతలపై సుజనా మండిపడ్డారు. రహస్యంగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేదన్నారు.

రహస్య భేటీ వార్తలపై సుజనా ఫైర్...
ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో తాను, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇటీవల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వుండి, తనను ప్రభుత్వం తొలగించడంపై కోర్టుకెళ్లిన సీనియర్ ఐఎఎస్ అధికారి రమేష్ కుమార్ రహస్యంగా సమావేశమైనట్టు కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసారాలు చేయడంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా పలువురు వైసీపీ నేతలు కూడా దీనిపై వారి స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారని సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు వాస్తవమేంటంటే..
లాక్ డౌన్ తరువాత తాను అధికార, వ్యాపార కార్యకలాపాలను బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ నుంచి నిర్వహిస్తున్నాను. అక్కడే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తనను కలుస్తున్నారని సుజనా తెలిపారు. అవి ఎంతమాత్రం రహస్య సమావేశాలు కాదన్నారు. తన కార్యకలాపాలను, సమావేశాలను రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని సుజనా తెలిపారు. ఈ నెల 13న కామినేని శ్రీనివాస్ తనను కలవడానికి అపాయింట్ మెంట్ తీసుకున్నారని, అదే రోజు రమేష్ కుమార్ కూడా తనను కలవాలని అడిగారని సుజనా స్పష్టం చేశారు. వారిద్దరు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు విషయాలపై తనతో సమావేశమయ్యారని, అవి ఎంతమాత్రం రహస్య భేటీలు కావన్నారు.

నిమ్మగడ్డ, కామినేనితో మాట్లాడింది ఇదే...
బీజేపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన కామినేని శ్రీనివాస్ తో ఏపీ పార్టీ వ్యవహారాలు మాట్లాడానని, ఆయన వెళ్లాక రమేష్ కుమార్ తనను కలిసినట్లు సుజనా వెల్లడించారు. నిమ్మగడ్డ తన కుటుంబానికి ఎంతో కాలంగా మిత్రులని సుజనా పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేకించి ఇటీవల పరిణామాలు గానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన విషయాలు కానీ చర్చించలేదని సుజనా స్పష్టం చేశారు.
అయితే కొన్ని మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు సీసీ ఫుటేజ్ చూపించి తాము ముగ్గురం సమావేశమయ్యామని, ఏదో గూడుపుఠాని వ్యవహారం నడిపామని, చట్టవిరుద్ధ చర్యలు చేపట్టామన్నంతగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రసారాలు చేశాయని సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా తెలివిగా గడుసుగా ప్రజలకు భ్రమ కల్పించే ప్రయతం చేశాయని సుజనా పేర్కొన్నారు.
Recommended Video

అన్నీ కుట్రంటే ఎలా ....
కామినేని, నిమ్మగడ్డతో తన సమావేశాలు చాలా సాధారణమైనవని, అవి చట్ట వ్యతిరేకంగానో, లేదా కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఎవరినో ఏదో చేయడానికో కాదని సుజనా పేర్కొన్నారు. దీనికి, రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు, వారి నేలబారు మనస్తత్వాలను బయటపెట్టుకున్నట్టేనన్నారు. నలుగురు కలిసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుందని సుజనా ఆక్షేపించారు. ఈ రకమైన బురద రాజకీయాలు చేసేవారితో గుంటలోకి దిగి వారితో కలబడి కుస్తీ పట్టడం తనకు అలవాటు లేదని,, అది తన స్థాయి కాదన్నారు. తానెప్పుడూ ఓపెన్ గానే వుంటానని, తన రాజకీయాలు పారదర్శకంగా వుంటాయని, రహస్య కార్యకలాపాలు చెయ్యనని, చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు












Click it and Unblock the Notifications