కేసీఆర్ కరోనాతో ఆంధ్రా కష్ఠాలు- మళ్లీ సమైక్యాంధ్ర- హుజురాబాద్ కోసమే- టీజీ కామెంట్స్
ఏపీ-తెలంగాణ మధ్య వాటర్ వార్ సందర్భంగా చాలా కాలం తర్వాత ఇరు రాష్ట్రాల రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఏపీ విభజన సందర్భంగా వినిపించిన మాటలన్నీ తిరిగి తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతుండగా.. వైసీపీ మంత్రులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇదే అదనుగా టీడీపీ, బీజేపీ ఎంపీలు రంగంలోకి దిగుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపేలా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణ మాటల తూటాలు
ఏపీ, తెలంగాణ మధ్య తాజాగా తెరపైకి వచ్చిన వాటర్ వార్ సందర్భఁగా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, మంత్రులు పొరుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ మంత్రులు ప్రారంభించిన మాటల యుద్ధాన్ని ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలు క్రమంగా అందిపుచ్చుకుంటున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రోజుకో రకంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రాజెక్టుల కేంద్రంగా సాగుతున్న ఈ మాటల దాడి తాజాగా పరాకాష్టకు చేరింది. ఇవాళ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ దాన్ని మరింత పీక్ కు తీసుకెళ్లారు.
కరోనాతో దెబ్బతిన్న కేసీఆర్ బ్రెయిన్
కరోనా సందర్భంగా ఏపీ నుంచి తెలంగాణ వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆరోపించారు. మనకు హైదరాబాద్ పై పదేళ్లు హక్కున్నా విడిచిపెట్టి వచ్చేశామని టీజీ విమర్శించారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా రావడం ఏపీ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని టీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాతో కేసీఆర్ బ్రెయిన్ దెబ్బతిందన్నారు. అందుకే ఏపీ ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్నారన్నారు.
ఒప్పందం కాదంటే మళ్లీ సమైక్యాంధ్ర
కేసీఆర్, ఆయన కేబినెట్ మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని టీజీ వెంకటేష్ విమర్శించారు. 2015లో జరిగిన ఒప్పందంలో కేసీఆర్ ఆమోదంతో రెండు రాష్ట్రాల అధికారులు ప్రాజెక్టుల విషయంలో సంతకాలు చేశారని టీజీ గుర్తుచేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ జనరేషన్ ప్రాజెక్ అయితే ఇన్ని రోజులు సాగునీటి కోసం ఎందుకు వాడారని టీజీ తెలంగాణ నేతల్ని ప్రశ్నించారు.
పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ 845 అడుగులకు నిండితే తప్ప రాయలసీమకు నీళ్లు రావని టీజీ అన్నారు. గత ఒప్పందాన్ని ఉల్లంఘించి పోతిరెడ్డిపాడుకు నీరు రాకుండా అడ్డుపడితే తిరిగి సమైక్యాంధ్ర ఇవ్వాలని డిమాండ్ చేశారు.2015 నాటి ఒప్పందాన్ని కాదంటే తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోతాయన్నారు.
Recommended Video
హుజురాబాద్ కోసమే వాటర్ వార్
కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, కర్నాట నీళ్లు తీసుకెళ్తే మాట్లాడని ఆయన.. పోతిరెడ్డిపాడు నీటిని మాత్రం తోడు కుంటారని టీజీ విమర్శించారు. కేసీఆర్ నవరసాలు పండించే నాయకుడని, ఆయన త్వరలో జరిగే హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే ఆంధ్రాతో జల యుద్ధం చేస్తున్నారని టీజీ ఆరోపించారు. తెలంగాణ తీరుపై ఏపీలో రాజకీయ పార్టీలు, నేతలు పోరాడాలని జగన్, చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను చూసి ఎవరూ భయపడటం లేదని, తెలంగాణలో మా ప్రజల ఓట్లున్నాయి జాగ్రత్త అని ఆయన తెలంగాణ మంత్రుల్ని హెచ్చరించారు.