అమిత్ షా కాన్వాయ్ పై వేసిన రాళ్లే...టీడీపీ సమాధికి పునాది రాళ్లు:బిజెపి నేత పేరాల
అమరావతి:మిత్ర పక్షాల నుంచి శత్రు పక్షాలుగా మారిన టిడిపి-బిజెపి మధ్య అలిపిరిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై టిడిపి నేతల దాడి అనంతరం మాటల యుధ్దం మరింత పతాక స్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో అలిపిరిలో తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై వేసిన రాళ్లే...టీడీపీ సమాధికి పునాదిరాళ్లు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన అమరావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి పై ఆరోపణలు, విమర్శల వర్షం కురిపించారు.
టీటీడీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపడం చంద్రబాబు పతనానికి నాంది అవుతుందని అన్నారు. మాయమైన పింక్ డైమండ్ 50 రూపాయల విలువ కూడా ఉండదని డాలర్ శేషాద్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు. పదవీ విరమణ చేసిన డాలర్ శేషాద్రి లాంటి వారిచేత మాత్రమే వ్యవస్థ నడపటం మంచిది కాదన్నారు. డైమండ్ ముక్కలైన విషయమై జరిపిన విచారణలో ఒక విలువైన వజ్రం ముక్కలు చేయబడినట్లు రమణకుమార్ నివేదికలో ఉందని పేరాల గుర్తు చేశారు.
గిల్టు, ఇమిటేషన్ నగలను పెట్టి స్వామివారి ఒరిజినల్ ఆభరణాలు మాయం చేస్తున్నారని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. అసలు పోటును 12 రోజులు ఎలా మూసేస్తారని నిలదీశారు. అసలు టీటీడీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని...ఆస్తులు, నగలు దేశాలు మారాయని ఆరోపణ ఉంది కాబట్టే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని పేరాల అన్నారు. ఈ విషయాల గురించి రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతం కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు.
మాయమైన వజ్రంపై అనేక ప్రచారాలు జరుగుతున్నందున ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నివేదిక ప్రజల ముందుంచాలని పేరాల డిమాండ్ చేశారు. శ్రీకృష్ణదేవరాయులు తిరుమల సందర్శనలో దేవుడికి విలువైన కానుకలు సమర్పించారని, ఇందుకు సంబంధించి పురావస్తు శాఖలో వివరాలు ఉన్నాయని...రాజులు ఇచ్చిన కానుకలు, భూముల వివరాలు అన్నీ అక్కడ స్పష్టంగా ఉన్నాయని పేరాల వెల్లడించారు. టిటిడిలో అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోందని పేరాల చెప్పారు. వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని పేరాల డిమాండ్ చేశారు.