ఎంపీ సీట్లపైనే ప్రతిష్టంభన: పురంధేశ్వరికి ఒంగోలు
గత ఎన్నికల్లో ఈ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి స్థానాలు వదులుకునేందుకు తెలుగుదేశం సుముఖంగా లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు స్థానాలే బీజేపీకి వెళితే పురందేశ్వరి ఒంగోలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే, ఆ స్థానాన్ని వదులుకునేందుకు టిడిపి సుముఖంగా లేకపోవటం, పొత్తులో భాగంగా వచ్చే స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతోనే హరిబాబు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
శుక్రవారంలోపు బీజేపీతో పొత్తు ఖరారు చేసుకుని, ఆ రోజున తొలి జాబితా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఒక పక్క బిజెపితో సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతూనే, తమంతట తాము జాబితా విడుదల చేయడం సరికాదని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తోంది.