రాబోయే ఎన్నికల్లో AP ఫలితాలను ముందే చెబుతున్న BJP??
రానున్న ఏపీ ఎన్నికల్లో ఫలితాల గురించి ఇప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. ఒక్కో పార్టీ నేతలు ఒక్కో విధంగా విశ్లేషణ చేస్తున్నారు. ఎన్నికలు జరగడానికి ఏడాదిన్నర సమయం ఉంది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ కూడగట్టుకుంటున్నాయి. పోరు హోరాహోరీగా జరగబోతోందని ప్రస్తుత రాజకీయ వాతావరణం తెలియజేస్తోంది. ఇటువంటి తరుణంలో బీజేపీ నాయకులు కొన్ని లెక్కలు చెబుతున్నారు.

ఏపీలో ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయం
ఇప్పటి వరకు ఎన్నో రాష్ట్రాల్లో ప్రయోగించిన ఫార్ములాను ఏపీలోకూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని కలుపుకొని ఎన్నికలకు వెళ్దామంటూ పవన్ ఒత్తిడి చేస్తున్నారు. అయితే బీజేపీ పెద్దలు దీనికి అంగీకరించడంలేదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 175 నియోజకవర్గాల్లో బీజేపీ-జనసేన కూటమి కలిసి పోటీచేయాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించిందంటూ కొందరు నాయకులు వెల్లడించారు.

కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో..
బీజేపీ-జనసేనకు రాష్ట్రంలో సంస్థాగతంగా పటిష్టమైన ఓటుబ్యాంకు లేదు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నాయి. రెండోసారి అధికారంలోకి వస్తామనే నమ్మకంతో జగన్ ఉండగా, ఈసారి అధికారం తమేదనని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
ఎన్నికలు జరిగే సమయానికి వ్యతిరేకత మరింత పెరుగుతుందని, అదే సమయానికి టీడీపీ కూడా బలపడుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ వస్తుందని, అప్పుడు జనసేన-బీజేపీ కూటమి కీలకమవుతుందని భావిస్తున్నారు.మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లుగానే ఏపీలో కూడా వస్తుందని చెబుతున్నారు.

40 స్థానాలు వస్తాయని బీజేపీ అంచనా?
ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా తరుచుగా ఏపీలో పర్యటించి పార్టీలో ఉత్తేజం తీసుకురావాలని, ఎన్నికల సమయంలో కొన్ని బహిరంగ సభల్లో పాల్గొనాలని నిర్ణయించారంటున్నారు. ఎన్నికలకు వెళ్లే సమయంలో జనసేన-బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటించాలని నిర్ణయించారంటూ వార్తలు వస్తున్నాయి. దీనివల్ల ఒక ప్రధాన సామాజికవర్గం తమవైపుకు మళ్లుతుందని, కూటమి తరఫున ఎన్నికలకు వెళితే 40 అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications