తిరుపతిలో బీజేపీ పోటీ- జనసేన తప్పుకుంది అందుకేనా ? వైసీసీ, టీడీపీకీ ప్రయోజనం
ఏపీలో త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నికల్లో మిత్రపక్షం జనసేనకు అవకాశం ఇవ్వకుండా తామే పోటీ చేయాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు బడ్జెట్లలోనూ ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రజల మూడ్ను సొమ్ము చేసుకునేందుకు ఇంతకంటే మంచి తరుణం దొరకదని వైసీపీ, టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ వ్యతిరేకతను గమనించే బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా పోటీకి ముందుకు రాకుండా కాషాయ అభ్యర్ధికి మద్దతివ్వాలని నిర్ణయించుకుందన్న వాదన వినిపిస్తోంది.
త్వరలో తిరుపతి ఉపఎన్నిక
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో గతేడాది ఖాళీ అయిన తిరుపతి లోక్సభ స్ధానంలో త్వరలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఉపఎన్నికలతో బిజీగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఏప్రిల్ 6న వాటిలో సగానికి పైగా ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా పలు సీట్లలో జరగాల్సిన ఉపఎన్నికలకూ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. దీంతో ఏపీలో రాజకీయ పార్టీలు కూడా తిరుపతి ఉపఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ సూచనప్రాయంగా తమ అభ్యర్ధుల్ని ప్రకటించగా.. తాజాగా బీజేపీ కూడా పోటీకి సిద్ధమైంది.
తిరుపతిలో పోటీకి బీజేపీ రెడీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరిగి పరిణామాలపై నిత్యం విమర్శలు చేసే బీజేపీ ఇప్పుడు అక్కడ పోటీకి ఉప ఎన్నిక రూపంలో దొరికిన అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. దీంతో మిత్రపక్షం జనసేనను ఒప్పించి మరీ తిరుపతి పోరులో రంగంలోకి దిగుతోంది. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీయే పోటీ చేస్తుందని జనసేన పార్టీ స్వయంగా ప్రకటించింది. దీంతో త్వరలోనే అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దాసరి శ్రీనివాస్తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, మరికొందరి పేర్లను తిరుపతి ఉపఎన్నిక కోసం బీజేపీ పరిశీలిస్తోంది. దీంతో బీజేపీ నిలబెట్టే అభ్యర్ధి కూడా కీలకంగా మారడం ఖాయమే.
తిరుపతిలో బీజేపీ పోటీతో వైసీపీ, టీడీపీ హ్యాపీ
తిరుపతిలో జనసేనను కాదని బీజేపీ పోటీ చేయాలన్న నిర్ణయం వైసీపీ, టీడీపీలో అంతర్గతంగా సంతోషం కలిగిస్తోంది. బయటికి చెప్పకపోయినా జనసేన పోటీ చేస్తే స్ధానికంగా ఉన్న ఓట్ల సమీకరణాలతో పాటు ఇతర అంశాలూ కొంత మేర కలిసి వచ్చి ఓట్ల చీలిక ఉంటుందని భావించిన వైసీపీ, టీడీపీ ఇప్పుడు బీజేపీ అభ్యర్ధి పోటీతో అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంచనా వేసుకుంటున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ రంగంలోకి దిగడం వల్ల తిరుపతి పోరు వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగడం ఖాయమనే అంచనాలో ఉన్నాయి. అదే సమయంలో విశాఖ ఉక్కుతో పాటు పలు అంశాల్లో ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీకి అక్కడ డిపాజిట్లు కూడా రావని లెక్కలు వేసుకుంటున్నాయి.
బీజేపీకి జనసేన కావాలనే అవకాశమిచ్చిందా ?
తిరుపతి ఉపఎన్నిక కోసం అభ్యర్ధి ఎవరుండాలనే విషయంలో కొన్ని నెలలుగా పట్టుబట్టిన జనసేన చివరి నిమిషంలో మాత్రం పోటీ నుంచి తప్పుకుని బీజేపీకే అవకాశం ఇచ్చేసింది. దీని వెనుక మారిన పరిస్ధితులే కారణంగా తెలుస్తోంది. గతంలో రాష్ట్రంలో వరుసగా జరిగిన దేవాలయాలపై దాడుల వ్యవహారంతో బీజేపీ, జనసేన ఉమ్మడిగా మైలేజ్ సాధించాయి. వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఇరుపార్టీలు కలిసి ముందుకు నడిచాయి. అప్పుడు వచ్చిన మైలేజ్తో జనసేన పోటీ చేస్తే బావుంటుందని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పాటు తాజా బడ్జెట్లోనూ బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తాను పోటీ చేస్తే బీజేపీపై వ్యతిరేకతతో ఓడిపేతే భవిష్యత్తులో ఆ ప్రభావం తమపై పడుతుంది. కాబట్టి ఈసారి బీజేపీకే అవకాశం ఇస్తే ఓడిపోయినా తమకు పెద్దగా ఇబ్బంది ఉండదని భావించినట్లు సమాచారం.