టీడీపీ ఎంపీల ఫిరాయింపుకు బీజేపీ కొత్త భాష్యం! ఆ నలుగురు అందుకే చేరారట
టిడిపి రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడి బీజేపీ పంచన చేరిన వార్త మొత్తం తెలుగు రాష్ట్రాలను కదిలించింది. అంతే కాదు కేంద్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా మారింది . ఇక టీడీపీ ఎంపీల పార్టీ మార్పుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు .పార్టీ మార్పు పై ఆయన మాట్లాడుతూ ఇప్పుడు చాలా మంది చూపు బీజేపీపై ఉందని చెప్పారు.

టీడీపీనే కాదు ఇతర పార్టీల నేతలు చాలా మందే టచ్ లో ఉన్నారన్న జీవీఎల్
ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని, వారి పేర్లు బయటపెట్టబోమని పేర్కొన్నారు జీవీఎల్ . బీజేపీ నాయకత్వం, నరేంద్రమోదీ పాలన పట్ల నమ్మకం ఉండబట్టే అనేకమంది బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని ఆయన వివరించారు.అంతే కానీ ఎలాంటి జిమ్మిక్కులు తాము చెయ్యలేదని, అలాంటి అవసరం కూడా బీజేపీకి లేదన్నారు. ఇది తాము చేసిన ఆపరేషన్ ఆకర్ష కాదని, నరేంద్రమోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా, మోడీపై నమ్మకంతోనే పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ మార్పుకు ఎలాంటి ఆపరేషన్ ఆకర్ష్ లు లేవు .. మోడీ చరిష్మా చూసే ఆకర్షణ
భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తామని గతంలో చెప్పిన విషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీని వీడిన టిడిపి నాయకులపై స్పందించిన బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు, "మేము టిడిపి ఎంపిలపై ఎలాంటి జిమ్మిక్కులు చెయ్యలేదని . వాస్తవానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా వారిని ఆకర్షించే బిజెపితో కలిసి నడవటానికి వచ్చారని పేర్కొన్నారు . నరేంద్ర మోడీ చరిష్మా చూసే పార్టీ మారుతున్నారని జీవీఎల్ పేర్కొన్నారు.

భవిష్యత్ అంతా బీజేపీదే .. ఇది ఆరంభం మాత్రమే
సార్వత్రిక ఎన్నికలకు ముందే మేము పలు ప్రాంతీయ పార్టీల నాయకులలో బీజేపీ పట్ల ఆకర్షితులైన ఈ ధోరణిని చూశాము, కాబట్టి మాకు ఇది కొత్తేమీ కాదన్నారు జీవీఎల్ . అయినప్పటికీ, భవిష్యత్తులో చాలా మంది నాయకులు మా వద్దకు వస్తారని ఆయన పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని బీజేపీలోకి వలసలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. నలుగురు ఎంపీలు సిఎం రమేష్, సుజనా చౌదరి, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు మోడీ, అమిత్ షాలను ఢిల్లీలో అనధికారికంగా కలుసుకున్నారని, ఇక మోడీ బిజెపిలో చేరడానికి అధికారికంగా తమ అంగీకారం తెలియజేశారని జీవీఎల్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications