రాజ్యసభ: నిర్మలకు టిడిపి ఛాన్స్!, ఏపీకి కేంద్రమంత్రులు.. వెంకయ్య లేకుండా
విజయవాడ: ఏపీ నుంచి కేంద్రమంత్రి, బీజేపీ నేత నిర్మలా సీతారామన్ను మరోసారి రాజ్యసభకు పంపించే అవకాశాలు మండుగా ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేక హోదా ఎఫెక్ట్.. బీజేపీ - టీడీపీ పొత్తు పైన పడకపోవచ్చునని అంటున్నారు.
బీజేపీ, టీడీపీలలో రాష్ట్ర నేతలు కొందరు ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నప్పటికీ.. ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ అధిష్టానం మధ్య ఇంకా సయోధ్య కొనసాగుతోందని, అది కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలకు మరోసారి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు.
ఏపీలో టీడీపీ - బీజేపీ కూటమికి మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. ఇందులో రెండు టిడిపికి, ఒకటికి బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి ఇచ్చే కోటాలో మరోసారి నిర్మలా సీతారామన్కు దక్కనుందని అంటున్నారు.
నిర్మలా సీతారామన్కు రాజ్యసభకు మరోసారి పంపించాలని ఇప్పటికే బీజేపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు ప్రతిపాదన తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. టిడిపి కూడా నిర్మలను మరోసారి పంపించేందుకు సానుకూలంగా ఉందని చెబుతున్నారు. దీంతో నిర్మల ఎంపిక లాంఛన ప్రాయమే అంటున్నారు.
వెంకయ్య లేకుండా ఏపీలో విజయోత్సవాలు!
ప్రధాని మోడీ పాలనకు రెండేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా రాకుండా, సరైన ఆర్థిక సహాయం అందకుండా ఆవేదనలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడంలేదని, నవ నిర్మాణ దీక్షలు చేస్తామని ప్రకటించారు.
మోడీ రెండేళ్ల ఉత్సవాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీగా జరగబోతున్నాయి. తాజా ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రం అసోంలో అధికారంలోకి రావడం, కేరళలో సీట్లు పెంచుకోవడం వగైరా పరిణామాలతో ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్ షా ఫుల్ జోష్లో ఉన్నారు.
ప్రతి రాష్ట్రానికి కేంద్రమంత్రులను పంపి మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను, ఆయన పరిపాలనా దక్షతను ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. కేంద్రమంత్రులు హాజరవుతారు.
ఏపీలో బీజేపీ విజయోత్సవాలకు తొమ్మిది మంది కేంద్రమంత్రులు (కేబినెట్, సహాయ) వస్తున్నారు. ప్రత్యేక హోదా, ఆర్థిక సాయం, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలను కేంద్రం నెరవేర్చలేదు. ఈ సమయంలో కేంద్ర మంత్రులు పంపించడం చర్చనీయాంసంగా మారుతోంది.
ఏపీలో 27న జరగనున్న విజయోత్సవ సభకు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ, మనోహర్ పారికర్, ఉమా భారతి, రవి శంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, మరో మంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప తదితరులు రాబోతున్నారు.
అయితే, రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడు మాత్రం హాజరు కావడం లేదు. ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక హోదా పైన వెంకయ్య నాయుడు నాడు రాజ్యసభలో గట్టిగా మాట్లాడారు. కానీ అది నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి వెంకయ్యను దూరంగా ఉంచడమే మేలని అధిష్టానం భావించి ఉంటుందని అంటున్నారు.