హోదాపై చిక్కుల్లో టిడిపి, బిజెపి: జగన్పై ఘాటుగా, పవన్పై మెతగ్గా...
జల్లికట్టు ఆందోళన స్ఫూర్తితో ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకు తలపెట్టిన ఆర్కె బీచ్ నిరసన వల్ల టిడిపి, బిజెపి చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. దీంతో పవన్, జగన్లను కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు విశాఖలోని ఆర్కె బీచ్లో తలపెట్టిన నిరసన ప్రదర్శనతో తెలుగుదేశం, బిజెపి చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నాయి. ఈ నిరసన ప్రదర్శనకు టాలీవుడ్ హీరోల నుంచి మద్దతు లభిస్తుండడంతో ఆ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయని చెప్పవచ్చు.
రాజకీయంగా ఆ ఆందోళనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజకీయంగా మద్దతు ఇస్తున్నారు. గురువారం జరిగే ర్యాలీలో తాను పాల్గొంటానని జగన్ ప్రకటించారు. తమపై విమర్శలు చేస్తున్న టిడిపి నాయకులపై పవన్ కల్యాణ్ విరుచుకుపడుతున్నారు.
దాంతో పవన్ కల్యాణ్, జగన్లకు టిడిపి, బిజెపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైయస్ జగన్పై ఎప్పటిలాగే టిడిపి నాయకులు ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్పై మాత్రం కాస్తా మెతగ్గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తమకు మద్దతు ఇవ్వడం వల్ల వారు ఆయనపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
జగన్పై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు
జగన్ కుట్ర, కుళ్లు రాజకీయాలు మానుకోవాలని టిడిపి పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం ఆయన కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జలికట్టుకి స్పెషల్ ప్యాకేజీకీ లింక్ పెట్టటం సమంజసంకాదని అన్నారు.
సరి కాదన్న కళా వెంకట్రావు
ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. విశాఖలో పెట్టుబడుల(సీఐఐ) సదస్సు జరగనున్న సమయంలో ఇలా చేయడం వల్ల నష్టపోతామని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఐఐ సదస్సును దెబ్బతీయడమే జగన్ ప్రధాన అజెండా అని ఆరోపించారు. పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే జగన్ కుట్ర అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఏమిటని ప్రశ్నిస్తూ రాష్ట్రానికి మేలు జరగడమే కావాలని అన్నారు. హోదా లేని ఏపీ పెట్టుబడుల్లో మొదటి స్థానంలో ఉంటే, హోదా ఉన్న రాష్ట్రాలన్నీ చివరి స్థానంలో ఉన్నాయని గుర్తుచేశారు.
వెంకయ్య వివరణ ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం సరిచేస్తుందని, ఇదే అంశాన్ని పార్లమెంట్ బయట, లోపల ప్రస్తావిస్తున్నట్లు ఆయన అన్నారు. రేపటి ప్రత్యేక హోదా నిరసనలపైనా వెంకయ్య నాయుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి వాదన వారు చెప్పుకునే అధికారం ఉందని అన్నారు. అయితే రేపటి నిరసనలకు ఎవరు వస్తారు? ఎవరు నడిపిస్తారో అందరూ చూస్తారని ఆయన అన్నారు తక్కువ సమయంలో ఎక్కువ నిధులు ఏపీకి మంజూరు అయ్యాయని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు. పెట్టుబడుల సదస్సు వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యవహరించాలని వెంకయ్య సూచించారు.
జగన్పై దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు
జగన్ వంటి అసమర్థ ప్రతిపక్ష నేత ఎక్కడా లేరని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. కుంభకోణాల్లో పీకల్లోతులో మునిగిపోయిన జగన్..ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 26 ప్రత్యేకమైన దినమని, దేశ ప్రజలు గర్వపడే రోజని అన్నారు. అలాంటి రోజున నిరసన కార్యక్రమాలు చేయడం సరికాదని, దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు ఉన్నారని, జగన్ లాంటి అసమర్థ నేత ఏ రాష్ట్రంలో లేరని మంత్రి అన్నారు. హోదాలో ఉన్న ప్యాకేజీ అంతా చట్టబద్దతో కోరుతున్నామని, ప్రభుత్వం అడిగేది కాకుండా ఏం అడుగుతున్నారో చెప్పాలని జగన్ను అడిగితే సమాధానం చెప్పలేక, మాట్లాడే సత్తాలేక, అసెంబ్లీలో నోరు తెరవలేదని దేవినేని ఉమ అన్నారు.
బిజెపి నేత హరిబాబు ఇలా..
ప్రత్యేక హోదా అంశాన్ని కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం తెరపైకి తెస్తున్నారని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆరోపించారు. వారి ప్రకటనలను విశ్వసించవద్దని ప్రజలను కోరారు. రెండు రోజుల పాటు జరిగే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంగళవారం కర్నూలులో ప్రారంభమయ్యాయి. ఇందులో హరిబాబు మాట్లాడారు. జల్లికట్టు డిమాండ్తో ప్రత్యేక హోదాను పోల్చడం సమంజసం కాదని, రెండింటికీ పోలికేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో లభించే ప్రయోజనాలన్నింటినీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా భర్తీ చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని హరిబాబు చెప్పారు.