AP రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న BJP?
భారతీయ జనతాపార్టీ వైఖరిని బట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆధారపడివున్నాయి. ఎటువంటి మలుపులు తిరగాలన్నా, కీలక మలుపు తీసుకోవాలన్నా అంతిమ నిర్ణయం బీజేపీదే. అలా ఆ పార్టీనీ వైఖరి నిర్ణయించుకుదశకు తెలుగుదేశం, జనసేన నెట్టేశాయి. త్వరలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. అందులో పాల్గొనేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెళ్లనున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత..
ఏపీలోని రాజకీయ పరిణామాలు, తెలుగుదేశం-జనసేన పొత్తు, తెలుగుదేశంతో పొత్తుతో ముందుకు వెళ్లే అవకాశం.. తదితర విషయాలను కూలంకుషంగా చర్చించనున్నారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ ను కలిసిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన రోడ్ మ్యాప్ పై జనసేనకు పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిందని భావించారు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులతో వెళతామని పవన్ ప్రకటించడంతో ఏపీ బీజేపీ నేతల గొంతుల్లో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది.

పార్టీ నేతల వైఖరివల్లే పవన్ దూరం?
విశాఖ పరిణామాల నేపథ్యంలో సోము వీర్రాజు పవన్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోముపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ నేతల వైఖరివల్లే పవన్ కల్యాణ్ బీజేపీకి దూరం కాబోతున్నారని విమర్శించారు. చంద్రబాబు-పవన్ తో కలిసి వెళ్లడమా? ఒంటరిగా వెళ్లడమా? అనేది జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీని ఒప్పించే బాధ్యత పవన్ తీసుకున్నారని, ఒకవేళ బీజేపీ కలిసి రాకపోయినా ఈ రెండు పార్టీలు కలిసివచ్చేవారితో కలిసి ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

పవన్ వేసే అడుగుల ఆధారంగానే..
పవన్ కల్యాణ్ వేసే అడుగుల ఆధారంగానే భవిష్యత్తు రాజకీయాలు ఆధారపడివుంటాయని సోము ఇప్పటికే ప్రకటించారు. రణస్థలంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలు కొత్తగా ఉన్నాయని, పొత్తులపై పవన్ పూర్తి స్పష్టతనిస్తే రాష్ట్రంలోని అందరి కత్తులు పదునెక్కుతాయంటూ సోము చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్లమెంటులో బిల్లులకు మద్దతు అవసరమైనప్పుడు వైసీపీ సాయం చేస్తోంది. ఆ సాయాన్ని కాదని టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రాజకీయ ప్రయాణం చేస్తుందా? లేదా? అనేదే ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications