విశాఖలో హోరెత్తిన ఉక్కు ఉద్యమం -పోలీసులను ధిక్కరించి భారీ ర్యాలీ, సభ -రాకేశ్ టికాయత్ కీలక సందేశం
'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' నినాదంతో పోరాట ఫలితంగా ఏర్పాటైన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రస్తుత నరేంద్ర మోదీ సర్కార్ ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ నగరంలో భారీ నిరసన ర్యాలీ, కీలక సమావేశం జరిగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పార్క్ హోటల్ నుంచి ఆర్కే బీచ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల జాతీయ నేత రాకేశ్ టికాయత్ సహా పలు కార్మిక, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ర్యాలీకి అనుమతి లేదని హెచ్చరించినా పోలీసులను ధిక్కరించి ఉద్యమకారులు ముందుకు సాగారు. ఆర్కే బీచ్లో రైతు, కార్మిక శంఖారావం సభకు భారీ జనసమీకరణ జరిగింది.
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూ
అమ్మడానికి వీల్లేదు..
విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మడానికి వీల్లేదని జాతీయ రైతు, కార్మిక సంఘాల నాయకులు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి మద్దతుగా జాతీయ రైతు, కార్మిక సంఘాల నాయకులు ఆదివారం విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వర్రావు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము అంగీకరించబోమని, ప్రజలు, కార్మికులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
లాభనష్టాలతో నిమిత్తం లేకుండా స్టీల్ ప్లాంట్ను అమ్మాలనుకోవడంలో అర్ధంలేదన్నారు. స్టీల్ ప్లాంట్ భూమి విలువ రూ.2 లక్షల కోట్లు పైనే వుంటుందని, ఆ విలువను రూ.52 కోట్లు అని చెప్పడం దారుణమని అన్నారు.
రాకేశ్ టికాయత్ ఆగ్రహం..
ఒక పక్క రైతులు కనీస మద్దతు ధర కోసం పోరాటం చేస్తుంటే.. మరోపక్క భారీ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కేంద్రం చేస్తోందని జాతీయ రైతు సంఘ నాయకులు రాకేశ్ టికాయత్ మండిపడ్డారు. స్థానిక ప్రజలు, రైతుల భూముల్లో పెట్టిన పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, ఉపాధి వస్తుందని ఆశించారని, ఇప్పుడు దీన్ని ప్రైవేట్ పరం చేస్తే.. తరవాత వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఇప్పటికే 23 ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేశారని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూస్తున్నారని, ప్రభుత్వం కంపెనీలా పనిచేస్తోందని అన్నారు. ఎయిర్ పోర్టులు, కంపెనీలు ప్రైవేట్ పరం చేస్తున్నారని, ప్రైవేట్ కంపెనీలు తెచ్చి వ్యవసాయ ఉత్పత్తుల రంగానికి తూట్లు పొడిచారన్నారు. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కేవలం వ్యాపారవేత్తలైన కేవలం రెండు కుటుంబాల కోసమే పని చేస్తోందని విమర్శించారు.
బీజేపీకి 122 సీట్లు: ఐదు దశల ట్రెండ్ ఇదేన్న అమిత్ షా -నందిగ్రామ్లో మమత ఓటమి తథ్యం
విశాఖ ఉద్యమానికి రైతుల మద్దతు
14 బిలియన్ల వ్యాపారాని తమ చేతుల్లోకి లాక్కొంటున్నారని అన్నారు. ప్రజా క్షేమం కోసం పెట్టిన పరిశ్రమలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకుని వెళ్ళడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. కార్మికుల, కర్షకులు, చిన్న వ్యాపారులు పోరాడే సమయం అసన్నమైందని తెలిపారు. అందరు కలిసి పోరాడాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకోవాలని, యువత ఉపాధిని పరిరక్షించించుకోవాలని పిలిపునిచ్చారు. పశ్చిమ యుపి, రాజస్థాన్లలో తమ ఉద్యమం వ్యాపించిందని, దేశవ్యాప్తంగా అన్ని చోట్లా పర్యటించి తమ ఉద్యమానికి మద్దతు కోరుతామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు.
రాజకీయ పక్షాలూ ఏకం కావాలి..
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి రావాలని ఎఐకెఎస్ జాతీయ నాయకులు అశోక్ దవాలే పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ఎఐకెఎస్ నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని, 67 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు.
నీరు, నింగి, నెలను అమ్మే ఆలోచన చేస్తున్నారని, నేలను, ఆహారాన్ని కూడా కబ్జా చేస్తున్నారని ఎఐకెఎస్ నాయకులు బల్ కరణ్ సింగ్ అన్నారు. అమెరికాకు తలొగ్గి ఇక్కడ ప్రభుత్వాలు నడుస్తున్నాయని, కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయని అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎలా దేశాన్ని దోచుకున్నారో.. అలాగే ఇప్పుడు దేశ సంపద కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. కరోనా వల్ల అన్ని వర్గాలు కుంటు పడిన సమయంలో ప్రభుత్వ రంగాన్ని సైతం దెబ్బ తీస్తున్నారన్నారు.