ప్రాణం తీసిన ‘టెలీ’కాల్ ప్రేమ: రైలు కిందపడి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఓ ఫోన్ కాల్ పరిచయం ప్రేమగా మారింది. పరిచయమైన అమ్మాయితో ఫొటోలు మార్చుకున్నాడు ఆ యువకుడు. తనను వివాహం చేసుకంటానని చెప్పడంతో ఆనందపడ్డాడు. కానీ తన ప్రేయసి తనను మోసం చేసిందని, ఆమె తనను బ్లాక్ మెయిల్ చేసి తన వద్ద డబ్బులు కోసం వేధింపులకు దిగేంత వరకు అతనికి తెలియలేదు. అంతటితో ఆగకుండా ఆమె తన సోదరిని పంపించి అతనిపై అత్యాచారం కేసు నమోదు చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ యువకుడు ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.
ఓక్లాలోని ఓ బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కుషల్ కుమార్. ఒక రోజు తాము సిమ్ కార్డ్ సేల్స్ చేస్తామని చెప్పి అతనికి ఓ యువతి నుంచి ఫోన్ వచ్చింది. తనకు అవసరం లేదని అతడు చెప్పాడు. తమ వద్ద ఆశ్చర్యకరమైన ఆఫర్లు ఉన్నాయని ఆమె చెప్పింది. ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత కుషల్.. ఆమె పేరు అడిగాడు. ఆమె తన పేరు నేహా(23) అని పరిచయం చేసుకుంది.

ఆ తర్వాతి రోజు మళ్లీ ఆమె అతనికి ఫోన్ చేసింది. తాను ఇప్పుడు సిమ్ కార్డు సెల్ చేసేందుకు ఫోన్ చేయలేదని చెప్పి.. ఈ రోజు ఎలా గడిచిందని అతనితో మాటలు కలిపింది. దీంతో వారిద్దరూ ఫోన్ కాల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఫొటోలు కూడా మార్చుకున్నారు. పరిచయం ప్రేమగా మారడంతో నేహా.. కుషల్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే వీరిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు.
కొన్ని వారాల తర్వాత ఫోన్ చేసిన నేహా అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత నేహా సోదరిగా చెప్పుకున్న ప్రీతి అనే మహిళ కుషల్ పని చేస్తున్న కంపెనీకి వచ్చి తన చెల్లెల్ని ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించింది. తన సోదరిని వేధింపులు గురిచేస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదరించింది. కుషల్ వేధింపుల కారణంగా తన సోదరి నేహా ఆత్మహత్యకు యత్నించిందని చెప్పింది. అంతేగాక అతని వద్ద నుంచి తరచూ డబ్బులు తీసుకెళ్లేది. డబ్బులు ఇవ్వకుంటే కేసు పెడతానని హెచ్చరించేది.
అయితే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు సరిగా స్పందించలేదని కుషల్ కుమార్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. గత బుధవారం నేహా.. ప్రీతి ఒక్కరేనని తెలుసుకున్న కుషల్ కుమార్, ఆమెకు డబ్బులు ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో ఆమె అతని ఆఫీసుకు వెళ్లి తన చేతిని కోసుకుని నానా హంగామా చేసింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుషల్ కుమార్ ఓక్లా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడి నుంచి అతని జీతం కంటే ఎక్కువగా సొమ్మును ప్రీతి బెదిరింపులకు గురి చేసి తీసుకుందని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications